ఎవరి ఒత్తిడి వల్ల నాపై కేసు?: బాబుని ఇరకాటంలో పెట్టిన వంశీ, కొలిక్కి!
విజయవాడ: గన్నవరం టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మంగళవారం నాడు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు. రామవరప్పాడులో ఇళ్లు కోల్పోతున్న బాధితుల సమస్యలను ఆయన వివరించారు.
రాష్ట్రంలో అభివృద్ధి కోసం భూసేకరణ చేయాల్సి ఉంటుందని, బాధితులకు తప్పకుండా పరిహారం చెల్లిస్తామని వంశీకి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అనంతరం చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రామవరప్పాడులో ప్రభుత్వ స్థలంలో నిర్మించుకున్న గుడిసెలను అధికారులు తొలగిస్తుండగా బాధితులు అడ్డుకున్నారు.
దాంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే వంశీ బాధితులకు అండగా నిలిచారు. వారితో కలసి ధర్నాకు దిగారు. దాంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయడంతో నిరసనగా వంశీ తన గన్మెన్లను వెనక్కి తిప్పి పంపించారు. ఇది టిడిపిలో వివాదానికి దారి తీసింది.
అయితే, చంద్రబాబు కల్పించుకోవడంతో ఈ సమస్య పరిష్కారమైందని తెలుస్తోంది. ఈ వివాదం విషయమై వంశీ, మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుల మధ్య కోల్డ్ వార్ మరోసారి తెరపైకి వచ్చిందని అంటున్నారు. పైకి బ్రిడ్జి, ఇన్నర్ రోడ్డు వివాదంలా ఇది కనిపిస్తున్నప్పటికీ... లోలోన టిడిపిలో వర్గ రాజకీయం కనిపిస్తోందని అంటున్నారు.
తన పైన కేసు పెట్టిన నేపథ్యంలో, వైరి వర్గంతో వంశీ తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారని చెబుతున్నారు. అయితే, చంద్రబాబుతో భేటీ అనంతరం హామీ లభించిన నేపథ్యంలో వంశీ ప్రస్తుతానికి చల్లబడ్డారని తెలుస్తోంది. మొత్తానికి ఈ వివాదం టిడిపిని ఇరకాటంలో పడేసింది.
అయితే, తన పైన కేసు పెట్టేందుకు ఒత్తిడి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియాల్సిందేనని వంశీ అంటున్నారట. చంద్రబాబు రూ.200 పింఛన్ రూ.1000 చేశారని, అలాగే రూ.500 పింఛన్ రూ.1500 చేశారని, ప్రజలకు ఎన్నో మంచి పనులు చేస్తున్నారని వంశీ చెబుతున్నారు.
ఇలాంటి సమయంలో ప్రభుత్వానికి, తమ పార్టీకి చెడ్డ పేరు రావొద్దనే తాను అధికారుల ఇళ్ల కూల్చివేతను అడ్డుకున్నానని వంశీ చెబుతున్నారు. ఇప్పటి వరకు తన పైన ఎవరూ కేసులు పెట్టలేదని, ఇఫ్పుడు తమ ప్రభుత్వంలోనే పెట్టడం బాధిస్తోందని అంటున్నారు. అయితే, సీఎం జోక్యంతో కూడా ప్రస్తుతానికి ఈ వివాదం ముగిసింది.