వల్లభనేని వంశీ సంచలన నిర్ణయం: ఎమ్మెల్యే పదవికి, టీడీపీకి రాజీనామా, రాజకీయాలకూ గుడ్బై
విజయవాడ: తెలుగుదేశం పార్టీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రెండ్రోజుల క్రితమే ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఆయన.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కలత చెందినట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యే పదవితోపాటు టీడీపీకి..
ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీకి, అలాగే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఆయన రాజీనామా లేఖ కూడా పంపారు.
రాజకీయాలకే గుడ్బై...
అంతేగాక, రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్లు వల్లభనేని వంశీ ప్రకటించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కొందరు అధికారుల తీరు పట్ల కేడర్ ఇబ్బంది పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబుకు లేఖలో..
‘మీ నేతృత్వంలో ప్రజాప్రతినిధిగా పనిచేసేందుకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఎమ్మెల్యేగా విజయవంతంగా పదవీకాలం పూర్తి చేసి రెండోసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాను' అని చంద్రబాబునాయుడుకు రాసిన లేఖలో వంశీ పేర్కొన్నారు.
మనస్సాక్షిని చంపుకోలేకే..
అంతేగాక‘నా అనుచరులు, మద్దతుదారులు.. స్థానిక వైసీపీ నేతలు, కొందరు ప్రభుత్వ అధికారులు వైఖరి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం నా దృష్టికి వచ్చింది. అయితే, వారి ఇబ్బందులను తొలగించేందుకు వేరే వాళ్లతో చేతులు కలిపే అవకాశం ఉన్నా నా మనస్సాక్షి అందుకు అంగీకరించడం లేదు. అందుకే ఓ నిర్ణయానికి వచ్చా. పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నా' అని వంశీ తన లేఖలో స్పష్టం చేశారు.
అందుకే ఎమ్మెల్యే పదవికి కూడా..
అనవసర శత్రుత్వం వద్దనుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వల్లభనేని వంశీ తెలిపారు. అందుకే పార్టీ సభ్యత్వానికి, ఎమ్యెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు చంద్రబాబుకు రాసిన లేఖలో వంశీ పేర్కొన్నారు. గత కొంత కాలంగా వంశీ పార్టీ మారుతారని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.
రాజీనామాకు ముందు ఇలా..
అయితే, వల్లభనేని వంశీ మొదట బీజేపీ నేత, ఎంపీ సుజనా చౌదరిని కలవడంతో ఆయన బీజేపీలోకి వెళ్తారని అంతా భావించారు. ఆ తర్వాత ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా కలిశారు. దీంతో వంశీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని అనుకున్నారు. అయితే, వంశీ రాకను గన్నవరం స్థానిక నేత యార్లగడ్డ వెంకటరావు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో వంశీ రాజకీయ సన్యాసం ప్రాధాన్యత సంతరించుకుంది.