కృష్ణాలో దేవినేని వర్సెస్ వంశీ: బాబు వద్ద మార్క్స్ కొట్టేసిన వల్లభనేని, ఫస్ట్ ర్యాంక్
విజయవాడ: ఏపీలోని బెజవాడ తెలుగుదేశం పార్టీలో గ్రూపు రాజకీయాలు కనిపిస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, ఎమ్మెల్యే వల్లభనేని వంశీల మధ్య కోల్డ్ వార్ జరుగుతోందని అంటున్నారు.
గన్నవరం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో తీవ్రంగా ఉన్న తాగు, సాగునీటి సమస్యను తీర్చేందుకు వంశీ అవలంభిస్తున్న తీరు మంత్రి దేవినేనికి ఆగ్రహం తెప్పిస్తోందని, ఇది వారి మధ్య చిచ్చు రేపుతోందని అంటున్నారు. తన నియోజకవర్గంలో తాగు, సాగునీటి సమస్య తీర్చేందుకు వంశీ సొంత ఖర్చుతో మోటార్లు కొనుగోలు చేశారు.
దాదాపు రూ.కోటిన్నర వరకు ఖర్చు చేసి పోలవరం కుడి కాల్వ నీటిని తోడించి.. నియోజకవర్గంలోని పలు చెరువులను నింపుతున్నారు. ఇందుకు జల వనరుల శాఖ కూడా సహకరించింది. సమస్య ఉన్న అన్ని గ్రామాల్లోను ఇలాగే నీటి సమస్య పరిష్కారానికి వంశీ ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.
ఈ మోటార్లన్నీ కలిపి గంటకు రెండు లక్షల లీటర్ల నీటిని ఎత్తిపోస్తున్నాయని తెలుస్తోంది. తొలుత ఈ విధానం పట్ల మంత్రి దేవినేని సుముఖత వ్యక్తం చేశారని, అయితే కృష్ణా, గుంటూరు జిల్లాల రైతాంగానికి తీవ్రమైన నీటి కొరత ఏర్పడటంతో మోటార్ల ద్వారా నీటి పంపింగ్ చేయడంపై దేవినేని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది.
దీంతో, మంత్రి దేవినేని జలవనరుల శాఖ అధికారుల పైన సీరియస్ అయ్యారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో, మంత్రి - ఎమ్మెల్యే మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని అంటున్నారు.
చంద్రబాబు ప్రకటించిన ఎమ్మెల్యేల లిస్ట్లో వంశీ ఫస్ట్
తిరుపతిలో జరిగిన పార్టీ సమావేశంలో పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఎమ్మెల్యేల పని తీరు జాబితాలో వల్లభనేని వంశీ మొదటి స్థానంలో ఉన్నారని, రైతాంగానికి నీటిని అందించి మేలు చేయడం వల్లే ఆయనకు ప్రథమ స్థానం వచ్చిందని చెబుతున్నారు.
ఎమ్మెల్యేల పనితీరులో వంశీ మొదటి స్థానంలో ఉండగా, మంత్రి కొల్లు రవీంద్ర రెండో స్థానంలో, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మూడో స్థానంలో ఉన్నారు. కృష్ణా జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇంఛార్జిలతో కలిపి 16 మందికి 16 ర్యాంకులు ఇచ్చారని తెలుస్తోంది.