కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే వంశీ, రాజీనామా!: అసలేం జరిగింది?
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రాజీనామా అంశం బుధవారం కలకలం రేపింది. అసెంబ్లీ లాబీల్లోనే రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.
Recommended Video
అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రాజీనామా అంశం బుధవారం కలకలం రేపింది. అసెంబ్లీ లాబీల్లోనే రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. డెల్టా షుగర్స్ విషయంలో ముఖ్యమంత్రి కార్యాలయ(సీఎంఓ) అధికారులు తన పట్ల అమర్యాదగా ప్రవర్తించారనే కారణంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే..
ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ.. సీఎం ఆఫీసులో కన్నీటి పర్యంతం అయ్యారు. ఆ తర్వాత ఆయన రాజీనామాకు సిద్ధపడ్డారు. రాజీనామా లేఖను స్పీకర్ కోడెలకు సమర్పించేందుకు ఆయన అసెంబ్లీకి వెల్లారు.
రంగంలోకి లోకేష్
విషయం తెలుసుకున్న మరో ఎమ్మెల్యే బోడె ప్రసాద్... వల్లభనేని వంశీని ఆపి, రాజీనామా లేఖను చించేశారు. వెంటనే ఈ విషయం మంత్రి నారా లోకేష్ దృష్టికి వెళ్లింది. దీంతో, వంశీని బుజ్జగించే బాధ్యతను మంత్రి కళా వెంకట్రావుకు అప్పగించారు లోకేష్. లోకేష్ ఆదేశాలతో కళా వెంకట్రావ్.. వల్లభనేని వంశీకి సర్ధి చెప్పారు. ముఖ్యమంత్రితో మాట్లాడతామని చెప్పారు. దీంతో వల్లభనేని వంశీ రాజీనామాపై వెనక్కి తగ్గారు.
గతంలోనూ..
హనుమాన్ జంక్షన్లో ఉన్న డెల్టా షుగర్స్ సంస్థ గత నాలుగు నెలలుగా మూతపడింది. దీన్ని తణుకుకు మార్చాలనే ప్రయత్నం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, షుగర్ ఫ్యాక్టరీని ఇక్కడే ఉంచాలని... ఇక్కడ నుంచి తరలిస్తే, ఎంతో మంది రైతులు తీవ్రంగా నష్టపోతారని వంశీ గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు.
దయచేసి ఆ నిర్ణయం వద్దు: బాబుకు వల్లభనేని వంశీ విన్నపం
తీవ్ర మనస్తాపంతో..
చెరుకు రైతులతో కలసి ఆయన సీఎంను కలసి, వినతి పత్రం అందించారు. తాజగా బుధవారం కూడా ఈ విషయంపై చర్చించేందుకు రైతులతో కలసి సీఎం కార్యాలయానికి వంశీ వచ్చారు. అయితే, ఈ సందర్భంగా ఆయనతో సీఎం కార్యాలయ అధికారులు దురుసుగా ప్రవర్తించారు. ముఖ్యంగా గిరిజా శంకర్ ఆయనతో సరైన రీతిలో వ్యవహరించలేదని తెలుస్తోంది. దీంతో వంశీ తీవ్ర మనస్తాపానికి లోనై, రాజీనామాకు సిద్ధపడ్డారు. వెంటనే స్పందించి.. లోకేష్, కళా వెంకట్రావు బుజ్జగించడంతో వంశీ వెనక్కి తగ్గారు.