జగన్ కు లేఖ రాసిన వల్లభనేని వంశీ ... ఆ విషయంలో నేను రెడీ అని ప్రకటన
Recommended Video
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగనమోహన్ రెడ్డికి గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ లేఖ రాశారు. తమ గన్నవరం నియోజకవర్గంలో చాలా గ్రామాల ప్రజలకు తాగు, సాగునీరు అందించాలని కోరారు. ప్రజల నీటి కష్టాలు తీర్చాలని కోరారు. నియోజకవర్గ ప్రజల తాగు నీరు, సాగు నీటి సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.
పోలవరం ప్రధాన కుడి కాలువ పూర్తి కావడానికి సహకరించిన రైతులను నీరిచ్చి ఆదుకోవాలని వంశీ లేఖ
పోలవరం ప్రధాన కుడి కాలువ పూర్తి కావడానికి సహకరించిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని లేఖలో పేర్కొన్నారు. అంతే కాదు కుడి కాలువ పనుల విస్తరణకు కోర్టు కేసులు కూడా వెనక్కు తీసుకుని ప్రభుత్వానికి సహకరించిన రైతులకు గత ఐదేళ్ళు గా మోటార్లతో పొలాలకు నీళ్లు అందించామని పేర్కొన్నారు వంశీ. మోటర్లతో రైతుల పొలాలకు నీరు పెట్టుకునే అవకాశం కల్పించాలని వేడుకున్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని విద్యుత్ అధికారులను ఆదేశించాలన్నారు.
తాను సొంతంగా ఏర్పాటు చేసిన 500 మోటార్లను ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నానన్న వంశీ
ఇక అంతే కాదు తానురైతుల కోసం తన వంతు సహకారం అందించటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. రైతుకు నీరిచ్చేందుకు తాను సొంతంగా ఏర్పాటు చేసిన 500 మోటార్లను ప్రభుత్వానికి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వల్లభనేని వంశీ తెలిపారు. అప్పట్లో రైతుల సహాయ నిరాకరణతో రైట్ మెయిన్ కెనాల్ పనులు నిలిచిపోయాయని తెలిపారు. కానీ మళ్ళీ రైతులను ఒప్పించి
ఆ విషయంలో తాను స్వయంగా జోక్యం చేసుకుని రైతులు పెట్టిన కేసులను తీసి వేయించినట్లు గుర్తు చేశారు.
అన్నదాతల సమస్య తీర్చాలని విజ్ఞప్తి .. సీఎం జగన్ వంశీ లేఖకు స్పందిస్తారా ?
కృష్ణా డెల్టాను కాపాడామని వల్లభనేని వంశీ లేఖలో పేర్కొన్నారు. వైఎస్ హయాంలో పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ప్రారంభమైందన్న వంశీ 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాను స్థిరీకరించే ప్రయత్నం చేశారని లేఖలో పేర్కొన్నారు. ఇక వల్లభనేని వంశీ ఈ లేఖను సంబంధితశాఖ మంత్రులకు కూడా పంపించారు గన్నవరం ఎమ్మెల్యే. అన్నదాతల సమస్యని అర్ధం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరి టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రైతుల కోసం లేఖ రాసి చేసిన ఈ విజ్ఞప్తి పట్ల సీఎం జగన్ ఎలా స్పందిస్తాడో మరి వేచి చూడాలి .