దేవినేని, వల్లభనేని వంశీల మధ్య చిచ్చు, చంద్రబాబుకు ఫిర్యాదు!
విజయవాడ: ఆది నుంచి ఉప్పునిప్పులా ఉన్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ మధ్య కల్వర్టు కూల్చివేత ఘటన మరోసారి నిప్పు రాజేసింది. గన్నవరం నియోజకవర్గం పైన పట్టు నిలుపుకునేందుకు నెహ్రూ ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.
అయితే తన నియోజకవర్గంలో ఇతర నేతల జోక్యాన్ని వల్లభనేని వంశీ సహించడం లేదని అంటున్నారు. ఇద్దరు నేతల మధ్య పొసగడం లేదని అంటున్నారు. దేవినేని నెహ్రూ ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
విజయవాడ గ్రామీణ మండలంలోని రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికెపాడు, నిడమానూరు తదితర గ్రామాలు గన్నవరం నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. ఈ గ్రామాల్లో పార్టీపరంగా వంశీకి మంచి పట్టు ఉంది. ఈ గ్రామాల్లో దేవినేని నెహ్రూకు అనుచరులు ఉన్నారు.
నెహ్రూ ఇటీవల టిడిపిలో చేరడంతో ఇరువర్గాలు ఆయా గ్రామాల్లో పట్టు కోసం ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. వంశీ, దేవినేని వర్గం తమ మాట చెల్లుబాటుకు ప్రయత్నిస్తున్నాయి. ఇద్దరు నాయకులు పావులు కదుపుతుండటంతో టిడిపి రెండుగా చీలిందని అంటున్నారు.
ఇదిలా ఉండగా, ఎనికేపాడులోని ఓ కళ్యాణ్ మండపం వద్ద అపార్టుమెంట్ వాసులు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన కల్వర్టుకు రెండు వైపులా ఉన్న గోడలను శుక్రవారం రాత్రి కూల్చేశారు. వీటిని నెహ్రూ అనుచరులు కూల్చేశారని అంటున్నారు.
అపార్టుమెంటువాసులు ఈ విషయాన్ని వంశీ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో నెహ్రూ జోక్యాన్ని వ్యతిరేకించారు. దీనిని అధినేత చంద్రబాబుకు, పార్టీ అధ్యక్షులకు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. నెహ్రూ పార్టీలో చేరినప్పుడే తన నియోజకవర్గంలో మరొకరు వేలు పెట్టరని చంద్రబాబు హామీ ఇచ్చారని వంశీ గుర్తు చేస్తున్నారట.