విలువలకు మారుపేరు హరిరామ జోగయ్య..! ఆయన త్వరగా కోలుకోవాలన్న పవన్ కళ్యాణ్..!!
హైదరాబాద్: మాజీ ఎంపీ హరిరామ జోగయ్యను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. అనారోగ్యంతో నగరంలోని ఏఐజీ హాస్పిటల్లో చికిత్సపొందుతున్న జోగయ్యను పవన్ కల్యాణ్ ఇవాళ ఉదయం కలిశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రజారాజ్యం సమయంలో రామజోగయ్య తన విలువైన సమయాన్ని కేటాయించారని.. తమ కుటుంబం కోసం ఎంతగానో కష్టపడ్డారని ప్రకటనలో పవన్ తెలిపారు. పార్టీకి మార్గదర్శకులుగా ఆయన ఉంటారన్నారు.
అనారోగ్యంతో బాధపడుతున్నా జనసేన పార్టీ వ్యూహాలపై ఆయన చర్చించడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. హరిరామ జోగయ్య త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. చిరంజీవి కుటుంబం అంటే తనకు ఎంతో ఇష్టమని పవన్తో హరిరామ జోగయ్య అన్నారు. ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకునే పార్టీ జనసేన అని.. చివరి శ్వాస వరకు పార్టీకి తన సేవలు అందుతాయని తెలిపారు. పవన్ కల్యాణ్ వెంట అందరూ నడవాలని పిలుపునిచ్చారు.
మాజీ మంత్రి హరిరామ జోగయ్య త్వరగా కోలుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న జోగయ్య హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం పవన్ ఆయన్ను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. 'నిబద్ధత కలిగిన జోగయ్య నరసాపురం ఎంపీగా 2004 నుంచి 2009 వరకు పనిచేశారు. మా కుటుంబం కోసం రాజీనామా చేసి వచ్చారు.
అనుభవజ్ఞులైన వారి సలహాలు, ఆశీస్సులు అవసరమని పోరాటయాత్ర సమయంలో పాలకొల్లు వెళ్లి ఆయన్ను కలిశాను. ఇప్పుడు అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నప్పటికీ జనసేన పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయం గురించి ఆయన నాతో చర్చించారు. ఆయన త్వరగా కోలుకోవాలని.. నాకు మార్గదర్శకులుగా ఉండాలని ఆశిస్తున్నాను. పాలకొల్లులో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ని ఏర్పాటుచేయాలని నిర్ణయించుకున్నాను. దీనికి జోగయ్య ఛైర్మన్గా వ్యవహరిస్తారు' అని అన్నారు.
జోగయ్య మాట్లాడుతూ.. 'నాకు చిరంజీవి కుటుంబమంటే ఎంతో ఇష్టం. పవన్కు వీరాభిమానిని. జనసేన పార్టీకి ఎప్పుడూ నా సహకారం ఉంటుంది. చివరి శ్వాస వరకూ పార్టీ కోసమే పనిచేస్తాను. ప్రజలందరి క్షేమం కోరుకుంటూ అందరినీ సురక్షితంగా చూసుకునే పార్టీ ఇది' అని పేర్కొన్నారు.