ఉద్దేశ పూర్వకంగానే దాడి: వంశీ, చెవిలో దూషించారన్న విష్ణు
హైదరాబాద్: కాంగ్రెస్ యువ నేతల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ వివాదం ముదురుతున్నట్లు కనిపిస్తోంది. ఘటనపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే విష్ణు వర్ధన్ రెడ్డి శనివారం మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్లే గొడవ మొదలైందని అన్నారు.
వంశీచంద్ రెడ్డి తన దగ్గరికి వచ్చి చెవిలో దూషించారని విష్ణు చెప్పారు. వంశీచంద్ గన్మెన్ తన తలకు గన్ ఎక్కుపెట్టారని తెలిపారు. ఏం జరుగుతుందో అని భయపడి తాను చేయి చేసుకున్నానని విష్ణు చెప్పారు. వంశీచంద్పై అధిష్టానానికి ఫిర్యాదు చేశానని తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఈ విషయంలో హుందాగా వ్యవహరించాల్సిందని అన్నారు.
ఇది ఇలా ఉండగా తాను విష్ణువర్ధన్ రెడ్డిని దూషించలేదని కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి అన్నారు. ఉద్దేశపూర్వకంగానే తనపై దాడి చేశారని చెప్పారు. సిసి కెమెరా ఫుటేజీని చూస్తే ఎవరు దాడి చేశారో కనిపిస్తుందని అన్నారు. తాను ఎవరికీ జవాబు చెప్పుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. అధిష్టానానికి ఈ ఘటనపై తాను ఫిర్యాదు చేయనని తెలిపారు.
శుక్రవారం జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్ రెడ్డి బావమరిది శశాంక్ రెడ్డి వివాహం శుక్రవారం మాదాపూర్లోని ‘ఎన్-కన్వెన్షన్'లో జరిగింది. వంశీచంద్ రెడ్డి కూడా ఈ వివాహానికి హాజరయ్యారు. హాలులోకి వెళుతున్న సమయంలో వంశీచంద్ గన్మెన్ విష్ణువర్ధన్ను పక్కకు నెట్టివేయడంతో ఘర్షణకు దారితీసిందని కొంతమంది చెబుతున్నారు. తన గన్మెన్ను ఎందుకు కొట్టారని వంశీ ప్రశ్నించడంతో ఇరువురి మధ్య వాగ్వివాదం జరిగి, ఘర్షణకు దారి తీసిందని అంటున్నారు.
కానీ ఈ వాదనను వంశీ ఖండిస్తున్నారు. హాలులోకి వెళుతున్న సమయంలో విష్ణు తనకు షేక్హ్యాండ్ ఇచ్చారని, ఆ వెంటనే తనపై అకారణంగా దాడి చేయడం ప్రారంభించారని ఆయన తెలిపారు. తాను చెప్పింది వాస్తవమో కాదో సిసి టివీ ఫుటేజీ చూస్తే తెలుస్తుందన్నారు. తన గన్మెన్ దాడి జరగకుండా అడ్డు వచ్చారే తప్ప విష్ణును నెట్టి వేయలేదన్నారు.