కాంగ్రెసు ఖాతాలోకి కల్వకుర్తి: వంశీచందర్ గెలుపు
హైదరాబాద్: మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం కాంగ్రెసు ఖాతాలో చేరింది. దీంతో తెలంగాణలో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 21కు చేరింది. జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలం ఐదుకు పెరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి తన సమీప ప్రత్యర్థి, బిజెపి అభ్యర్థి టి. ఆచారిపై 78 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ మండలం జూపల్లి పంచాయతీకి సంబంధించిన 119వ పోలింగ్ కేంద్రం పరిధిలో ఈవీఎంలో సాంకేతిక లోపం తలెత్తడంతో సోమవారం రీపోలింగ్ నిర్వహించారు. ఈ కేంద్రంలో 867 మంది ఓటర్లుండగా, 833 ఓట్లు పోలయ్యాయి.
వంశీచంద్రెడ్డికి 358, బీజేపీ అభ్యర్థి ఆచారికి 428, స్వతంత్ర అభ్యర్థి జంగయ్యకు 14, టీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్యాదవ్కు ఏడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి ఎడ్మ కిష్టారెడ్డికి 9 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి హుస్సేన్కు 9, మరో స్వతంత్ర అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డికి నాలుగు ఓట్లు పడ్డాయి.
నోటా మీటకు ఏడు ఓట్లు పోలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ చెప్పారు. అంతకుముందు వంశీచంద్రెడ్డికి 157 ఓట్ల ఆధిక్యత ఉండడంతో మొత్తమ్మీద బిజెపి అభ్యర్థిపై ఆయన 78 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 119వ పోలింగ్ బూత్లో రీపోలింగ్ జరగడం యాదృచ్చికమే అయినా, 119వ అసెంబ్లీ సెగ్మెంటుకు సంబంధించిన ఫలితం కావడం విశేషం.