ఏపీ అసెంబ్లీలో వంశీ సీటు ఎక్కడ: టీడీపీ సస్పెన్షన్ తో కొత్త చర్చ: లిస్టులో ఎవరెవరు..!
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల ముహూర్తం ఖరారైంది. ఇదే సమయంలో టీడీపీ నుండి ఎంతమంది ఎమ్మెల్యేలు పార్టీకి దూరమవుతారనే చర్చ ఆసక్తి కరంగా మారింది. ఇప్పటికే టీడీపీ రెబల్ ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ మీద టీడీపీ సస్పెన్షన్ వేటు వేసింది. కానీ, ఆయన వైసీపీకి మద్దతిస్తానని చెప్పినా...అనర్హత వేటు దిశగా ఫిర్యాదు చేయలేదు. దీంతో..అధికారిక లెక్కల ప్రకారం ఇంకా టీడీపీ ఎమ్మెల్యేనే. అయితే, పార్టీ సస్పెండ్ చేసినా..ఎమ్మెల్యేగా కొనసాగే అవకాశం ఉంది.
దీంతో..ఆయనకు అసెంబ్లీలో సీటు ఎక్కడ. టీడీపీతో ఉంటా..ప్రత్యేకంగా సీటు ఇస్తారా..వైసీపీతో అప్పుడే కలిసి కూర్చొనే అవకాశం లేదు. అదే విధంగా..అసలు టీడీపీ ఎమ్మెల్యేల్లో ఎంతమంది సభకు హాజరవుతారు. పార్టీ వీడాలనుకుంటున్న వారు వెళ్లి వంశీ పక్కన కూర్చుంటారా..టీడీపీ చెంబ్ ల్లోనూ ఆశీసునలవుతారా...ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ సమావేశాల సమయంలో టీడీపీ ఎమ్మెల్యేల్లో ఉండేదెవరు..వీడి వెళ్లేదెవరు అనే అంశం పైన స్పష్టత వస్తుందని అంచనా వేస్తున్నారు.
అసెంబ్లీలో వంశీ సీటు ఎక్కడ..
టీడీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ తాను ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తానని ప్రకటించారు. టీడీపీ రెబల్ ఎమ్మెల్యేగా ఆ పార్టీ నేతల మీద విమర్శలు చేస్తున్నారు. దీంతో..వంశీ మీద టీడీపీ సస్పెన్షన్ వేటు వేసింది. అయితే, ఎమ్మెల్యేగా మాత్రం ఆయన పైన అనర్హత వేటు వేయాలని ఇప్పటి వరకు కోరలేదు.
తాను పార్టీ వీడుతున్నట్లుగా చెప్పిన తరువాత..తనను సస్పెండ్ చేయటం ఏంటని వంశీ ప్రశ్నిస్తున్నారు. దీంతో..అధికారికంగా వంశీ ఇప్పటికీ టీడీపీ శాసన సభ్యుడే. కానీ, టీడీపీ సస్పెండ్ చేసిన ఎమ్మెల్యే. ఎమ్మెల్యేగా సభకు హాజరయ్యే అవకాశం మాత్రం వంశీకి ఉంది. దీంతో..ఆయన టీడీపీ బెంచ్ ల్లో కూర్చొనే అవకాశం లేదు. అందుకు వంశీ సైతం సిద్దంగా లేరు. దీంతో..ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల సమయంలో వంశీ తీరు ఎలా ఉండబోతుంది..ఆయన సీటు ఎక్కడ కేటాయిస్తారనేది ఆసక్తి కరంగా మారింది.
వంశీ స్వతంత్ర ఎమ్మెల్యేగా గుర్తిస్తారా..
టీడీపీ వంశీని సస్పెండ్ చేసినట్లుగా ముందుగా అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలి. ఆ సమాచారంతో వంశీ ఎమ్మెల్యే కొనసాగుతూనే..సస్పెన్షన్ ఎత్తివేసే వరకూ స్వతంత్ర ఎమ్మెల్యేగా పరిగణిస్తారని అసెంబ్లీ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆయనకు టీడీపీ బెంచ్ ల్లో సీటు ఉండే అవకాశం కనిపించటం లేదు.
ఆయన్ను స్వతంత్ర అభ్యర్దిగా మరో చోట సీటు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. అయితే, ఆ విధంగా సీటింగ్ ఇస్తే వంశీ ద్వారా ఇంగ్లీషు మీడియం..ఇసుస అంశాల పైన చర్చ సమయంలో ప్రభుత్వానికి మద్దతుగా వంశీతో మాట్లాడించాలని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే, దీనికి ముందుగా టీడీపీ అధికారికంగా స్పీకర్ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలి.
వంశీతో కలిసేది ఎవరు..టీడీపీలో చర్చ..
ఇక, వంశీ మీద టీడీపీ సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో..ఆయన ఎమ్మెల్యేగా సభకు హాజరైనా స్వతంత్ర ఎమ్మెల్యేగా మరో చోట కూర్చోవాల్సి ఉంటుంది. ఇదే సమయంలో టీడీపీ నుండి మరి కొంత మంది ఎమ్మెల్యేలు పార్టీ వీడటానికి సిద్దంగా ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది .అందులో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు దాదాపు పార్టీ వీడినట్లుగానే టీడీపీ భావిస్తోంది.
కానీ, ఆయన ఎక్కడా పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదు. చంద్రబాబు ఆదేశాలన ధిక్కరిస్తూ పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ కు గైర్హాజరయ్యారు. కానీ, ఆయన పైన చర్యల దిశగా చర్చ లేదు. సమావేశాలు ప్రారంభమయ్యే లోగా..ఎవరైనా ఎమ్మెల్యే లు పార్టీ వీడినా..ఎమ్మెల్యేగా కొనసాగుతూనే మరో పార్టీకి మద్దతుగా మాట్లాడినా టీడీపీ ఇదే విధంగా సస్పెన్షన్ కే పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తోంది. తమ నిర్ణయం ఏంటనేది బయటకు చెప్పకుండా జాగ్రత్త పడే ఎమ్మెల్యేలు సడన్ గా సభలోనే వెళ్లి వంశీ పక్కనే కూర్చున్నా అశ్చర్యం లేదనే వాదన వినిపిస్తోంది.
టీడీపీని వీడేదెవరో తేలిపోనుందా..
ఇక, ఈ అసెంబ్లీ సమావేశాల సమయంలోనే టీడీపీలో ఉండే ఎమ్మెల్యేలు ఎవరు..వీడి వెళ్లేదెవరో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక ..ఇంగ్లీషు మీడియం అంశాల పైన చంద్రబాబు వాయిస్ కు పార్టీ ఎమ్మెల్యేల్లో అధిక శాతం మంది నుండి మద్దతు రావటం లేదు. ఆయన చేసిన దీక్షకు పలువురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు.
ఇక, ఇప్పుడు వంశీ విషయం చూసిన తరువాత..పార్టీ వీడాలని భావిస్తున్న ఎమ్మెల్యేలు ఏం చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. అసెంబ్లీ సమావేశాలకు అసలు హాజరవుతారా...హాజరైనా టీడీపీ సభ్యులతో పాటే కూర్చుంటారా..లేక అంతకు ముందే తమ వైఖరి ప్రకటిస్తారా అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. అయితే, టీడీపీ అధినాయకత్వం మాత్రం పార్టీ వీడకుండే ఎమ్మెల్యేలను నివారించే ప్రయత్నాలు ప్రారంభించింది.