మీ ఖాతాలో పడుతుందా.. తెలుసుకో, చిరంజీవికి నీకంటే ఎక్కువే: పవన్ కళ్యాణ్కు వంగలపూడి అనిత
విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత కౌంటర్ ఇచ్చారు. పీహెచ్సీకి, సీహెచ్సీకి తేడా తెలియకుండా పాయకరావుపేట పీహెచ్సీ అప్ గ్రేడ్ చేయలేదన్న ఆయన వ్యాఖ్యలను ఆమె కొట్టి పారేశారు. పవన్ తీరు చూస్తుంటే ఆయనకు సమస్యల పైన ఏమాత్రం అవగాహన లేదని అర్థమవుతోందన్నారు.
పాయకరావుపేటలో జరిగిన బహిరంగ సభలో అవగాహనరాహిత్యంతోనే జనసేనాని తమపై ఆరోపణలు చేశారని చెప్పారు. ఒక పీహెచ్సీ ఉన్న ప్రాంతానికి, ఐదు కిలో మీటర్లలోపు మరో ఆసుపత్రి ఉంటే విస్తరణ కుదరదని చెప్పారు. పాయకరావుపేటలో పీహెచ్సీ ఉండగా కేవలం కిలో మీటరు దూరంలో తునిలో 100 పడకల ఆసుపత్రి ఉందన్నారు.
పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి
శ్రీరాంపురంలో కూడా పీహెచ్సీ ఉందన్న విషయం జనసేనాని తెలుసుకోవాలని వంగలపూడి అనిత అన్నారు. నక్కపల్లిలో వున్న సీహెచ్సీని 30 పడకల నుంచి 50 పడకలుగా విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. త్వరలోనే కార్యరూపం దాల్చుతుందన్నారు. ఇసుక తవ్వకాలను తాను ప్రోత్సహించనని, కఠిన చర్యలు తీసుకోమని అధికారులకు ఆదేశాలు జారీ చేశానని చెప్పారు.
ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారు
తాండవ నది ఆక్రమణలు ఎవరి హయాంలో జరిగిందో తెలుసుకోవాలని వంగలపూడి అనిత అన్నారు. పాయకరావుపేటలో జూనియర్ కళాశాల ఉండగా లేదనడం హాస్యాస్పదమన్నారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ను పవన్ చదువుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. పాయకరావుపేట నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అనే విషయం తెలియక 2019లో జనసేన ఖాతాలో పేట చేరుతుందనడం హాస్యాస్పదమన్నారు.
చిరంజీవికి ఇంతకంటే ఎక్కువ వచ్చారు
తన సభలకు వచ్చిన జనాలను చూసి, అవే ఓట్లు అనుకుంటూ పవన్ భ్రమల్లో ఉన్నారని పవన్ చెప్పారు. పవన్ అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన సమయంలో సభలకు అంతకంటే ఎక్కువ జనం హాజరయ్యేవారన్నారు. కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు నాలుగేళ్లలో నియోజకవర్గంలో చేపట్టానని, ఈ విషయం ప్రజలందరికీ తెలుసునని చెప్పారు.
ప్రభుత్వం, పవన్ సాయం
ఇదిలా ఉండగా, పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు కడుతూ ఇద్దరు పవన్ అభిమానులు మృతి చెందిన విషయం తెలిసిందే. వారికి వంగలపూడి అనిత చంద్రన్న బీమా ద్వారా ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. అలాగే, పవన్ కళ్యాణ్ కూడా ఆర్థిక సాయం అందించడంతో పాటు పిల్లలను చదివిస్తానని చెప్పారు.