దమ్ముంటే రా!: జగన్కు వంగలపూడి అనిత హెచ్చరిక, 'అలా ఐతే అమరావతి బాండ్లు ఎందుకు'
అమరావతి: పాయకరావుపేట నియోజకవర్గంలో కోటవురట్లలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన విమర్శలపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత మంగళవారం స్పందించారు. ఆరోపణలపై దమ్ముంటే జగన్ బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.
జగన్ రూ.కోటి విరాళం, కేసీఆర్కు కేరళ సీఎం లేఖ: అరబ్ బిజినెస్ టైకూన్ల భారీ విరాళాలు
పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తున్నట్లు, అవినీతిపరులైన జగన్కు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతే కనిపిస్తోందని ధ్వజమెత్తారు. అనవసర ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. జగన్కు ఫ్లెక్సీలు కట్టిన వారే ఇసుక మాఫియాలో పెద్ద దొంగలు అని విమర్శించారు.
వాళ్లే దొంగలు
జగన్కు ఫ్లెక్సీలు కట్టిన వారు ఇసుక మాఫియా దొంగలు అని తాము చెప్పడం లేదని, వారిపై ఇప్పటికే పలు కేసులు నమోదయి ఉన్నాయని, ఇదే నిదర్శనం అనిత అన్నారు. జగన్కు ముఖ్యమంత్రి కుర్చీ తప్ప ఇంకేమీ కనిపించడం లేదన్నారు.
అంతకుముందు రోజు జగన్ ఆరోపణలు
కాగా, జగన్ సోమవారం తన పర్యటనలో టీడీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. యూపీలో టన్ను చెరకుకు రూ.3,150 ఇస్తున్నారని, ఇక్కడ చక్కెర కర్మాగారాలు నష్టాల్లో ఉన్నాయని, యూపీలో ఉన్నదేమిటి, మనకు లేనిదేమిటని ప్రశ్నించారు. చంద్రబాబు కుర్చీలో కూర్చోవడమే దీనికి కారణమన్నారు. తుమ్మపాల మూసేశారని, తాండవ పరిశ్రమ, ఏటికొప్పాక, గోవాడ పరిశ్రమలు రూ. కోట్ల నష్టాల్లో ఉన్నాయిని, బ్రహ్మాండంగా నడవాల్సిన వీటిని నష్టాల బాట పట్టించారన్నారు.
చినబాబు, పెదబాబులకు లంచాలు
ఏటికొప్పాక పరిశ్రమ వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రూ. 5 కోట్ల లాభంలో ఉండేదని, ఇప్పుడు ఆరు నెలలుగా జీతాలు ఇవ్వలేని పరిస్థితికి చేరడం బాధనిపిస్తోందన్నారు. నక్కపల్లి మండలంలో పరిశ్రమల పేరున ఆరు వేల ఎకరాల భూమిని రైతుల దగ్గర నుంచి లాక్కున్నారని, సగం భూములకు పరిహారం ఇవ్వలేదన్నారు. భూములు నోటిఫై చేయడం వల్ల రైతులు అమ్ముకోవడానికి కుదరడం లేదని, పిల్లల పెళ్లిళ్లు చేసుకోలేకపోతున్నారన్నారు. వరహానదిలో ఇసుకను తోడేస్తున్నారని, దీంట్లో ఎమ్మెల్యే నుంచి చినబాబు, పెదబాబు వరకు లంచాలు ఉన్నాయని జగన్ ఆరోపించారు.
చంద్రబాబుపై పార్థసారథి ఆగ్రహం
చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రానికి క్యాన్సర్ జబ్బులా పట్టుకుందని, ఆర్థికంగా అతలాకుతలం చేస్తోందని వైసీపీ నేత పార్థసారథి వేరుగా అన్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని ఆర్థిక వనరుగా మార్చుకుని విచ్చలవిడిగా దోచుకుంటున్నారన్నారు. స్వలాభం కోసం విభజన హామీలను తాకట్టు పెట్టారని, అప్పుల అప్పారావుగా మారి రాష్ట్రాన్ని అప్పులో ఊబిలో ముంచేస్తున్నారన్నారు. చంద్రబాబు దోచుకున్న సొమ్మునే బాండ్ల రూపంలో ఇన్వెస్టర్ల పేరుతో కొంటున్నారని, సీఆర్డీఏ ఆర్థికంగా బలంగా ఉంటే బాండ్లు ఎందుకు ఇవ్వాల్సి వస్తోందని నిలదీశారు. రాష్ట్రంపై పడుతున్న ఆర్థిక భారం ఎవరు మోస్తారన్నారు. మంత్రుల ఛాంబర్లలోకి నీళ్లు ఎలా వచ్చాయని, మంత్రులే పైపులు కోశారా అని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర హక్కులను కాపాడటంలో విఫలమైందన్నారు. అందుకే అందినకాడికి దోచుకుందామనే ఆలోచనలో ఉన్నారన్నారు.