రోజాను ఎదుర్కొని పదవి ఆశించినా.., చంద్రబాబు ఆగ్రహం: నేనెంత అన్న వంగలపూడి అనిత
ఏపీ కేబినెట్లో చోటు దక్కనుందుకు పలువురు సీనియర్ నేతలు, చోటు దక్కుతుందని ఆశలు పెట్టుకున్న కొత్త ఎమ్మెల్యేలు అసంతృప్తికి లోనయ్యారు. వంగలపూడి అనిత, బోండా ఉమామహేశ్వర రావు వంటి వారు తొలుత కొంత అసంతృప్తికి
అమరావతి: ఏపీ కేబినెట్లో చోటు దక్కనుందుకు పలువురు సీనియర్ నేతలు, చోటు దక్కుతుందని ఆశలు పెట్టుకున్న కొత్త ఎమ్మెల్యేలు అసంతృప్తికి లోనయ్యారు. వంగలపూడి అనిత, బోండా ఉమామహేశ్వర రావు వంటి వారు తొలుత కొంత అసంతృప్తికి లోనయ్యారు.
అయితే, వంగలపూడి అనిత ఆ వెంటనే సర్దుకున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను అనిత ధీటుగా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీంతో ఆమెకు కేబినెట్లో చోటు దక్కుతుందన్న ఊహాగానాలు జోరుగా వినిపించాయి. కానీ దక్కలేదు. దీనిపై ఆమె ఆ తర్వాత సానుకూలంగా స్పందించారు.
మంత్రి పదవి రానందుకు ఆగ్రహించిన వారిపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. క్రమశిక్షణ తప్పితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అనిత తగ్గి ఉండవచ్చునని అంటున్నారు. తాను తొలిసారి ఎమ్మెల్యేను కాబట్టి ఆమె అర్థం చేసుకున్నారని మరికొందరు అంటున్నారు.
నిరాశ ఏం లేదు
వైసిపి ఎమ్మెల్యే రోజాకు ధీటుగా కౌంటర్ ఇస్తున్న వంగలపూడి అనితకు మంత్రి పదవి వస్తుందని భావించారు. కానీ చోటు దక్కలేదు. దీనిపై ఆమె స్పందించారు. కేబినెట్లో తనకు చోటు దక్కకపోవడంతో నిరాశ, నిస్పృహ లేదని పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత అన్నారు. పార్టీ పటిష్ఠతపైనే కార్యకర్తలు దృష్టి సారించాలన్నారు.
వారి ముందు నేనెంత
మంగళవారం నక్కపల్లిలో టీడీపీ ముఖ్య నాయకులు, జన్మభూమి కమిటీల ప్రతినిధులతో వేర్వేరుగా జరిగిన సమావేశాల్లో మాట్లాడారు. 2019లో జరిగే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని, ఇందులో ఎటువంటి సందేహం లేదన్నారు. రాజకీయంగా, ఎమ్మెల్యేగా తనకు కేవలం రెండున్నరేళ్ల అనుభవమని, పార్టీలో ఎంతోమంది సీనియర్ ఎమ్మెల్యేలు దశాబ్దాల నుంచి పనిచేస్తున్నారని, వారి ముందు నేను ఎంత అన్నారు.
చంద్రబాబు ఆలోచించే చేస్తారు.. వారికి అనిత హెచ్చరిక
ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం చేసినా ఆలోచించి చేస్తారని, ఆయన నిర్ణయానికి అందరూ బద్దులై ఉండాల్సిందే అన్నారు. గత ఎన్నికల్లో తనకు కేవలం మూడు వేల ఓట్లలోపే మెజార్టీ లభించిందని, వచ్చే ఎన్నికల్లో 20వేల ఓట్లు మెజార్టీ వచ్చేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు.
అనుచరులకు హెచ్చరిక
ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రజల ఆశీస్సులున్నంత వరకూ తనకు మంత్రి పదవి అవసరం లేదన్నారు. ఇప్పటికే కోట్లాది రూపాయలతో నియోజకవరాన్ని అభివృద్ది చేశానన్నారు. రానున్న రెండేళ్లలో పార్టీ కోసం పనిచేయని నాయకులెవరైనా సరే పక్కన పెట్టేందుకు వెనుకాడబోనని ఆమె హెచ్చరించారు. పార్టీ ఉంటేనే గుర్తింపు ఉంటుందన్న విషయాన్ని పార్టీ శ్రేణులు గుర్తించాలన్నారు.