ఎవరి బినామీ?: సంచయితపై సంచలన ఆరోపణలు చేసిన వంగలపూడి అనిత
అమరావతి: సింహాచలం దేవస్థానం, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ సంచయిత గజపతిరాజుపై తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనంత రంగంలోకి దిగారు. చీకటి జీవోతో నియమితులయ్యారంటూ సంచయితపై మండిపడ్డారు. అలాంటి వ్యక్తి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్సీ నారా లోకేశ్పై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని అన్నారు.
భూములపై జగన్, ఆ ఎంపీ కన్నుపడటంతోనే..
మాన్సాస్ ట్రస్ట్ బైలాస్ ప్రకారం పురుష వారసుడే ట్రస్ట్కి ఛైర్మన్గా ఉండాలనే నిబంధన ఉందని, కానీ, సింహాచలం దేవస్థాన భూములపై కన్నేసిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం.. సంచయితను ట్రస్ట్ ఛైర్మన్గా నియమించిందని ఆరోపించారు. జగన్ సర్కారు నియమ నిబంధనలు పట్టించుకోలేదని, జగన్ పుర్రెకు పుట్టిన బుద్ధిని అధికారులు అమలు చేస్తుంటారని విమర్శించారు. గోశాలకు చంద్రబాబు ప్రభుత్వం కేటాయించిన 125 ఎకరాలపై వైసీపీకి చెందిన పెద్ద డేగ కన్ను పడిందని, దేవస్థానం గోశాలలో గోపులు చనిపోతున్నాయని చెప్పి.. ఆ భూములను కాజేయడానికి కుట్రలు చేస్తున్నారని అనిత ఆరోపించారు.
సంచయిత ఎవరి బినామీనో.. ఆ మాత్రం తెలియదా?
సంచయిత ఎవరి బినామీనో ఆమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆస్తి హక్కు వేరు.. వంశపారంపర్య పదవులు వేరనే విషయం కూడా సంచయితకు తెలియదా? అని అనిత ప్రశ్నించారు. ఏపీ హోంమంత్రి స్క్రిప్ట్ చూసి కూడా మాట్లాడలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్పై సీబీఐ, లేదా ఇతర కేంద్ర సంస్థలతో విచారణ కోరే దమ్ము, ధైర్యం సుచరితకు ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంపై సమాధానం చెప్పకుండా.. చంద్రబాబు, లోకేశ్లను విమర్శించడం ఏంటని నిలదీశారు.
సంచయిత ఛీటింగ్ చేసి..
ఆనంద గజపతిరాజు మొదటి భార్య ఉమకు ఎప్పుడో విడాకులు ఇచ్చారన్న అనిత.. ఆమె కుమార్తె సంచయిత చీకట్లో ఛీటింగ్ చేసి ట్రస్ట్ ఛైర్మన్ పదవిని పొందారని అన్నారు. ఆమె సక్రమంగా నియమింపబడి ఉంటే.. అందుకు సంబంధించిన జీవోను ఎందుకు వెబ్సైట్లో పెట్టలేదని అనిత ప్రశ్నించారు. పాస్పోర్ట్ , ఆధార్ కార్డు చూపించే ధైర్యం ఆమెకు ఉందా? అని నిలదీశారు.
తండ్రి పేరూ రాసుకోలేని సంచయిత.. హోంమంత్రిపై అనిత విమర్శలు
తన ఇంటి నేమ్ బోర్డుపై తండ్రి పేరు రాసుకోలేని సంచయిత.. ఆయన పూర్వీకులు స్థాపించిన సంస్థకు ఛైర్మన్గా కొనసాగడం సిగ్గుచేటని అనిత విమర్శించారు. అంతేగాక, తన పదవి నిలబడాలంటే చంద్రబాబు, లోకేశ్ లపై ఆరోపణలు చేయడం తప్ప, సంచయితకు గత్యంతరం లేదని దుయ్యబట్టారు. ట్రస్ట్ పరిధిలోని పెద్ద ఉద్యోగులు జీతాలు తీసుకుంటుంటే.. కిందిస్థాయిలో జీతాలు తీసుకునే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు రోడ్డున పడటానికి సంచయితే కారణమని ఆరోపించారు.