వంగవీటి హత్య: బాబుకు కన్నా నిలదీత, భార్య ఆత్మహత్యాయత్నం మాటేంటి: జోగయ్యకు ప్రశ్న
గుంటూరు: వంగవీటి రంగా హత్య కేసులో చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని ఆరోపించిన వైసిపి నేత హరిరామ జోగయ్య పైన కాపు సంఘం జాతీయ అధ్యక్షులు రామానుజయ మంగళవారం మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు కాపులకు పెద్దపీట వేస్తున్నారన్నారు.
హరిరామ జోగయ్య రాసిన పుస్తకంలో ఎక్కడా వాస్తవాలు లేవన్నారు. భార్య ఆత్మహత్యాయత్నం గురించి రామజోగయ్య ఎందుకు ప్రస్తావించలేదో చెప్పాలని నిలదీశారు. కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
చంద్రబాబు నిర్దోషిత్వం నిరూపించుకోవాలి: కన్నా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును భారతీయ జనతా పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణ టార్గెట్ చేశారు. హరిరామ జోగయ్య పుస్తకంలోని అంశాల పైన చంద్రబాబు విచారణ జరిపించుకొని తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని సవాల్ చేశారు.
కాపులకు అన్యాయం: ముద్రగడ
కాపులకు అన్యాయం జరుగుతోందని ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. చంద్రబాబు అబద్దాల పుట్ట అన్నారు. ఆయన మాటలు ఎవరూ నమ్మరన్నారు. కాపు ఉద్యమాన్ని అడ్డుకునేందుకు వంద కోట్ల కార్పోరేషన్ అంటూ కొత్త నాటకం మొదలు పెట్టారన్నారు. రెండేళ్లలో రెండువేల కోట్లు జమ కావాలన్నారు. కాపులను బిసిల్లో చేర్చే వరకు ఉద్యమం అన్నారు.
చంద్రబాబుతో కారెం శివాజీ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబుతో దళిత నేత కారెం శివాజీ భేటీ అయ్యారు. వారు దళితుల సమస్యల పైన చర్చించారు.