సింగపూర్ లోను శిశువులు మాయమవుతున్నారా? : చంద్రబాబును నిలదీసిన వంగవీటి
విజయవాడ : ఏపీలో ప్రభుత్వాసుపత్రుల పనితీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆరోగ్యశాఖ పర్యవేక్షణ కొరవడడం వల్లే తరుచూ చిన్నారులపై ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. తాజాగా విజయవాడలోని ప్రభుత్వాసుపత్రిలో శిశువు మాయమవడంతో.. ఇంత జరుగుతుంటే ఆరోగ్యశాఖ ఏంచేస్తోందని..? నిలదీస్తున్నారు ప్రతిపక్ష నేతలు.
శిశువు మాయమయ్యాడన్న విషయం తెలియడంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో బాధిత కుటంబాన్ని పరామర్శించారు వైసీపీ నాయకుడు వంగవీటి రాధా. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, సీపీఎం నేత బాబురావు కూడా బాధితులను పరామర్శించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రుల నిర్లక్ష్యంపై స్పందించిన వంగవీటి రాధా.. సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఏపీని సింగపూర్ లా చేస్తానని ప్రకటించుకుంటున్న చంద్రబాబు, సింగపూర్ ఆసుపత్రుల్లో కూడా ఇలాగే శిశువులు మాయమవుతున్నారేమో..? చెప్పాలన్నారు. తన ఇంటికెళ్లే మార్గంలో అడుగడుగుకు సీసీటీవీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసుకున్న చంద్రబాబు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు.
ఆరోగ్యశాఖ అలసత్వాన్ని తప్పుబట్టిన రాధా, వెంటనే ఆ శాఖకు మంత్రిగా కొనసాగుతోన్న కామినేని శ్రీనివాస్ రాజీనామా చేయాలని, లేనిపక్షంలో సీఎం కల్పించుకుని మంత్రిని శాఖ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే, శిశువు మాయమవడం వెనుక ఓ మహిళ ప్రమేయం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొద్దిరోజులుగా ఓ మహిళ ఆసుపత్రిలో అనుమానస్పదంగా తిరుగుతున్నట్టు గమనించిన కొందరు, ఆమె శిశువును ఎత్తుకెళ్లి ఉండవచ్చిన అనుమానం వ్యక్తం చేస్తున్నారు.