మళ్లీ రాజుకుంటున్న బెజవాడ: దేవినేని నెహ్రూకు వంగవీటి రాధా సవాల్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలో రాజకీయం మరోసారి వేడెక్కుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెసు నాయకుడు దేవినేని నెహ్రూకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వంగవీటి రాధా సవాల్ విసిరారు. మాతో పెట్టుకునేందుకు మీరు సిద్ధమా అంటూ ఆయన దేవినేని నెహ్రూకు సవాల్ విసిరారు.
తమ మౌనాన్ని చేతకాని తనంగా తీసుకోవద్దని ఆయన అన్నారు. తాము ఇప్పటికే చాలా నష్టపోయామని, మళ్లీ నష్టపోయేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. దేవినేని నెహ్రూ పిచ్చిమాటలు మానుకోవాలని ఆయన అన్నారు.
మాజీ శాసనసభ్యుడు వంగవీటి మోహన రంగా ప్రజా నాయకుడని ఆయన అన్నారు. వంగవీటి మోహన రంగా 27వ వర్ధంతి సందర్భంగా శనివారం విజయవాడ నగరంలోని రాఘవయ్య పార్క్ సెంటర్లోని ఆయన విగ్రహానికి కుమారుడు వంగవీటి రాధా పూలమాల వేసి నివాళులు అర్పించారు.
రంగాపై విమర్శలు చేసే అర్హత ఎవరికీ లేదని ాయన అన్నారు. తన తండ్రి రంగాపై అసంబద్ధమైన విమర్శలు ఎవరు చేసినా సహించబోమని ఆయన అన్నారు. రాధా - రంగా మిత్ర మండలి ఆధ్వర్యంలో చేపట్టి పలు సేవా కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు.
తన తండ్రి వంగవీటి మోహనరంగాపై దేవినేని నెహ్రూ పిచ్చి వాగుడు మానుకోవాలని ఆయన కోరారు. చనిపోయినవారి గురించి మాట్లాడటం హీరోయిజం అనుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఇంట్లో కూర్చొని కనుసైగలతో రాజకీయం చేస్తున్నట్లు..పిచ్చి భ్రమల్లో బతుకుతున్నారని వంగవీటి రాధాకృష్ణ ఆరోపించారు.
ఎవరిని నరుకుతున్నారు.. ఏం నరుకుతావు అని వంగవీటి రాధాకృష్ణ ప్రశ్నించారు. దేవినేని నెహ్రూ వల్లే తమ కుటుంబం నష్టపోయిందని, తాము దేనికైనా సిద్ధమని వైసీపీ నేత వంగనీటి రాధాకృష్ణ స్పష్టం చేశారు.