చంద్రబాబుకు తొత్తులా: కామినేనికి సవాల్ విసిరిన వంగవీటి రాధ
మచిలీపట్నం: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస రావు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తొత్తులా వ్యవహరిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ వ్యాఖ్యానించారు. కొత్తమాజేరులో విషజ్వరాల వల్ల 18 మంది చనిపోవడం బాధాకరమని ఆయన అన్నారు.
కామినేని మాత్రం ఎవరికీ రోగం రాలేదని చెబుతున్నారని, సాక్ష్యాలతో సహా నిరూపిస్తామని అంటూ ఆ విషయం తాము నిరూపిస్తే మంత్రి రాజీనామా చేస్తారా అని వంగవీటి రాధా సవాల్ చేశారు. విషజ్వరాల బాధితులకు సాయం చేయాలని డిమాండ్ చేస్తూ మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయం వద్ద వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దీక్ష చేపట్టారు.
జగన్ దీక్షాశిబిరం వేదికపై నుంచి వంగవీటి రాధా మంగళవారంనాడు మాట్లాడారు. వైయస్ జగన్ దొంగ దీక్ష చేస్తున్నారని పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి విమర్శించారన, తమ పార్టీ నేతపై అనవసరమైన మాటలు మాట్లాడితే సహించబోమని ఆయన అన్నారు.
దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి, వంగవీటి రంగా అభిమానులు తిరుగబడుతారని ఆయన హెచ్చరించారు. ప్రజల పక్షాన నిరంతరం పోరాడే నాయకుడు ఒక్క జనగ్ మాత్రమేనని ఆయన అన్నారు. మరో మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు పట్టిసీమ ప్రాజెక్టులో ముడుపులు తీసుకున్నారని ఆయన ఆరోపించారు.