కొండమీద ఉండబట్టే.. లేకపోతే దుర్గ గుడిని బాబు కూల్చేవాడు : వంగవీటి రాధా
విజయవాడ : కృష్ణా పుష్కర పనుల్లో భాగంగా.. ఏపీ సర్కార్ పలు హిందూ దేవాలయాలను కూల్చివేయడంతో.. కూల్చేసిన దేవాలయాలన్నింటిని తిరిగి నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు. ఇదే డిమాండ్ తో బెజవాడలో దీక్ష చేస్తోన్న వీహెచ్ పీ సభ్యులను శుక్రవారం నాడు వైసీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు వంగవీటి రాధా పరామర్శించారు.
దేవాలయ పునర్మిర్మాణం కోసం దీక్ష చేస్తోన్న వీహెచ్ పీ సభ్యులకు సంఘీభావం తెలిపిన రాధా.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా ఆలయాల కూల్చివేత గురించి ప్రస్తావించిన ఆయన.. 'మన అదృష్టం కొద్దీ దుర్గమ్మ తల్లి కొండ మీద ఉండిపోయిందని.. లేకపోతే అమ్మవారి దేవాలయాన్ని కూడా ఈపాటికి చంద్రబాబు గారు తొలగించేవారని' ఆరోపించారు రాధా.
దేవాలయాలను తొలగించి.. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఆలయాలను దర్శించుకునే వెసులుబాలు లేకుండా చేశారని చంద్రబాబుపై మండిపడ్డారు రాధా. వీహెచ్ పీ సభ్యులకు మద్దతు తెలుపుతూ.. తొలగించిన ఆలయాలను వెంటనే పునర్నిర్మించాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారాయన.