నా తండ్రిని చంపిన పార్టీలోకా.. సమస్యే లేదు, చెత్తవార్తలు రాస్తే..: వంగవీటి రాధా
విజయవాడ: తను పార్టీ మారుతున్నట్టుగా వస్తున్న వార్తలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వంగవీటి రాధా తీవ్రంగా ఖండించారు. వైఎస్సార్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు అని తన విషయంలో జరుగుతున్న ప్రచారంపై ఆయన మండి పడ్డారు.
వైసీపీని వీడే సమస్యలే లేదు, వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పని చేయడమే తన విధి అని ఆయన వ్యాఖ్యానించారు. అంతే కాదు.. తాను పార్టీ మారతానని కల్పిత వార్తలు రాయవద్దని రాధా కోరారు.
వంగవీటి రాధా వైకాపాను వీడి తెలుగుదేశం తీర్థం పుచ్చుకుంటారు అని గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. వెబ్ మీడియా ద్వారా ఈ ప్రచారం గట్టిగా జరిగింది. సోషల్ మీడియా ద్వారా దీనికి మరింత ప్రచారం లభించింది.
ఈ నేపథ్యంలో ఈ వార్తలపై వంగవీటి రాధా స్వయంగా స్పందించాల్సి వచ్చింది. 'అలాంటి చెత్తవార్తలు రాస్తే.. పరువు నష్టం దావా వేస్తాను..' అని కూడా ఆయన హెచ్చరించారు.
'వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాకు సోదర సమానుడు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి గెలిచి.. పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం. నా తండ్రిని చంపిన తెలుగుదేశం పార్టీలోకి చేరాల్సిన ఖర్మ నాకు పట్టలేదు..' అని రాధా వ్యాఖ్యానించారు.