నా తండ్రి హంతకుడతనే, కోడెల పేరెత్తకుండానే: వంగవీటి హెచ్చరిక
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. 1988లో తన తండ్రి వంగవీటి రంగా హత్య ఘటనలో ఇప్పటి స్పీకర్ ప్రధాన నిందితుడని ఆయన ఆరోపించారు.
గుంటూరు: 1988లో తన తండ్రి వంగవీటి రంగా హత్య ఘటనలో ఇప్పటి స్పీకర్ ప్రధాన నిందితుడని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక, ఆయనపై ఎలాంటి చర్యా తీసుకోలేదని మండిపడ్డారు. ప్రస్తుత స్పీకర్ కోడెల శివప్రసాద్ పేరెత్తకుండా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఆదివారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో ఆయన ప్రసంగించారు. కాపుల న్యాయమైన కోర్కెల సాధన కోసం శాంతియుతంగా ఉద్యమిస్తున్న ముద్రగడ పద్మనాభంను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వంగవీటి రాధాకృష్ణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు చేసిన పాదయాత్రకు అప్పటి ప్రభుత్వం నుండి అన్ని అనుమతులు తీసుకునే చేశారా? అని నిలదీశారు. ముద్రగడ పాదయాత్రకు ప్రభుత్వం అనుమతించకుంటే కాపులంతా సంఘటితమై రోడ్డెక్కుతారని, దేనికైనా తెగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వుంటుందని రాధా తేల్చి చెప్పారు.
బాబు అబద్ధాలకు కాలం చెల్లింది!
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును నమ్మి మోసపోయామనే భావన ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. బాబు అబద్ధాలకు ఇక కాలం చెల్లిందన్నారు. వైసిపి ప్లీనరీలో ఆదివారం ఆమె మాట్లాడుతూ.. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో చంద్రబాబు పాలనకు సున్నా మార్కులు వస్తున్నాయన్నారు.
Recommended Video
వైసీపీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు, ఆయన తనయుడు అడ్డంగా లూటీ చేసేవారని, రాష్ట్రంలోని భూములన్నీ నిలువునా దోపిడీ చేసేవారని పద్మ ఆరోపించారు. చంద్రబాబు పాలనకు కాలం చెల్లిందని కార్యకర్తలు ప్రజలకు చాటి చెప్పాలని, ఎన్నికలకు సిద్ధం కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ ప్లీనరీ ద్వారా చంద్రబాబు గుండెల్లో నగారా మోగించాలని పద్మ అన్నారు.