దున్నపోతు మీద వాన కురిసినట్టుంటే ఏం చెయ్యగలం .. వైసీపీ సర్కార్ పై వంగవీటి రాధా అసహనం
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాజధాని అమరావతి గ్రామాల , అలాగే కృష్ణా , గుంటూరు జిల్లాలలో ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ మరోపక్క మూడు రాజధానుల ఏర్పాటుకు శరవేగంగా పావులు కదుపుతున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఆరునూరైనా సరే మూడు రాజ్హానులను ఏర్పాటు చేసి తీరతామని చెప్తున్నారు. ఇక అమరావతి కోసం పోరాటం ఉధృతంగా సాగుతుంది.
సీఎం జగన్ తాజా వ్యూహం ..మూడు రాజధానుల కోసం.. టీడీపీకి చెక్ పెట్టేలా వైసీపీ కార్యాచరణ
విజయవాడలో భారీ ర్యాలీలో పాల్గొన్న వంగవీటి రాధాకృష్ణ
రాజధాని అమరావతి రైతులకు మద్దతుగా విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించింది అమరావతి జేఏసీ . అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కుమ్మరిపాలెం సెంటర్ నుంచి సితార సెంటర్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ పాల్గొన్నారు. రైతులకు తన మద్దతు తెలిపారు. నేనున్నాను నేను విన్నాను అని చెప్పుకునే జగన్ కు రాజధాని రైతుల గోడు వినిపించటం లేదా అని ప్రశ్నించారు వంగవీటి రాధాకృష్ణ .
దున్నపోతు మీద వర్షం కురిసినట్టు ఉంటే ఏం చేస్తాం? అని అసహనం
ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ, ఇన్ని రోజుల నుంచి రైతులు ఉద్యమిస్తున్నా ప్రభుత్వం స్పందించక కపోవడంపై మండిపడ్డారు. దున్నపోతు మీద వర్షం కురిసినట్టు ఉంటే ఏం చేస్తాం? అని అసహనం వ్యక్తం చేశారు . రాజధాని అమరావతి తరలింపు నిర్ణయం సరైంది కాదని ఆయన నిప్పులు చెరిగారు. కులాల ప్రాతిపదికన రాష్ట్రాన్ని విడదీస్తున్నారని పేర్కొన్న రాధాకృష్ణ తమకు తెలిసిన కులం మానవత్వమే అని పేర్కొన్నారు . ఇప్పటికైనా ప్రభుత్వం తన మూర్ఖత్వాన్ని పక్కనబెట్టి, ప్రజల గురించి ఆలోచించాలని వంగవీటి రాధా హితవు పలికారు .
కోర్టు ఉత్తర్వులను కూడా ప్రభుత్వం ధిక్కరిస్తుందన్న రాధాకృష్ణ
సీఎం జగన్ కు చట్టాలన్నా గౌరవం లేదని, కోర్టు ఉత్తర్వులను కూడా ప్రభుత్వం ధిక్కరించడంపై ఆయన విమర్శలు గుప్పించారు. ‘మూడు రాజధానులు' కాదు ఒక్కటే రాజధానిని కొనసాగించాలని అది కూడా అమరావతినేనని వంగవీటి డిమాండ్ చేశారు. రాజధాని అంశం రాష్ట్రానికి సంబంధించిన సమస్య కనుక అన్ని పార్టీలు, అన్ని సంఘాల మద్దతు తీసుకుని జేఏసీతో కలిసికట్టుగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.ప్రజల నుండి మద్దతు అమరావతి కోసం వస్తున్నా, సీఎం జగన్ పునరాలోచించకపోవటం దారుణం అని వంగవీటి పేర్కొన్నారు.