'టీడీపీలోకి వంగవీటి రాధా, అంతా మైండ్ గేమ్, పథకం ప్రకారమే': జగన్ 2సార్లు బుజ్జగించినా!
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ పార్టీని వీడుతున్నట్లు ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. దీనిపై వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ మైండ్ గేమ్ అని వారు అభిప్రాయపడుతున్నారు.
చదవండి: ఒబామా 'మైక్రో టార్గెటింగ్ స్ట్రాటేజీ': జగన్కు పీకే సరికొత్త వ్యూహం, అసలేమిటి?
Recommended Video
తాజాగా, బుధవారం వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. వంగవీటి రాధను తమ పార్టీకి చెందిన మరో నేత అప్పిరెడ్డి భేటీ అయ్యారని, పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలపై ఆయనతో చర్చించారని చెప్పారు. రాధాకృష్ణ వైసీపీని వీడే అవకాశమే లేదని వెల్లడించారు.
చదవండి: వైసీపీ నుంచి ఆఫర్ కానీ, పవన్ కళ్యాణ్ చెప్పలేదు, మేమూ చెప్పలేదు: కన్నాl
అంతా టీడీపీ మైండ్ గేమ్
తెలుగుదేశం పార్టీ మైండ్ గేమ్లో భాగంగానే ఈ ప్రచారం సాగుతోందని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. వంగవీటి రాధా అసంతృప్తితో ఉన్నాడనేది కూడా టీడీపీ నేతల కల్పితాలేనని ఆయన మండిపడ్డారు. రాధాకృష్ణ పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను ఖండిస్తున్నామని, ఓ పథకం ప్రకారమే ఇలాంటి దుష్ప్రచారం జరుగుతోందని రాధా-రంగా మిత్ర మండలి సభ్యులు అడపా శేషు పేర్కొన్నారు.
జగన్ రెండుసార్లు బుజ్జగించినా, హామీ ఇచ్చినా
ఇదిలా ఉండగా, వంగవీటి రాధా అసంతృప్తిగా ఉన్నారని తెలిసి జగన్ ఆయనను రెండుసార్లు తన వద్దకు పిలిపించుకొని బుజ్జగించారని, అయినా వినలేదని కూడా ప్రచారం జరిగింది. జగన్ బుజ్జగించినా పార్టీ వీడేందుకే మొగ్గు చూపారని అన్నారు. మల్లాది విష్ణును పార్టీలోకి తీసుకు వచ్చినా రాధా భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తానని జగన్ హామీ ఇచ్చారని అన్నారు.
అక్కడే వివాదం
మల్లాది విష్ణును పార్టీలోకి తీసుకోవడం విషయం పక్కన పెడితే, ఆయనకు విజయవాడ సెంట్రల్ హామీ ఇవ్వడాన్ని వంగవీటి రాధా జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. జగన్ ఆయనతో రెండుసార్లు మాట్లాడినా తగ్గలేదని ప్రచారం సాగింది. అసెంబ్లీ టికెట్లను ఇచ్చే క్రమంలో ఏమైనా ఇబ్బందులు వస్తే, వంగవీటి రాధా గతంలో పోటీ చేసిన విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని అయినా ఇస్తానని జగన్ హామీ ఇచ్చారని, అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే, గతంలో పీఆర్పీ నుంచి పోటీ చేసిన విజయవాడ తూర్పు కీలక నేత యలమంచిలి రవి వైసీపీలోకి వస్తున్నారని వార్తలు వచ్చాయి. దీంతో యలమంచిలి రవికి విజయవాడ తూర్పును కేటాయిస్తానని జగన్ హామీ ఇచ్చారని కూడా వార్తలు వచ్చాయి.
టీడీపీలోకి వస్తే, 2019లో గెలిస్తే మంత్రి పదవి కూడా
ఈ నేపథ్యంలో తనకు విజయవాడ తూర్పు సెగ్మెంట్ కూడా దక్కదన్న అనుమానమే వంగవీటి రాధాను టీడీపీ వైపు వెళ్లేలా చేసిందని అంటున్నారు. మరోవైపు టీడీపీ నేతలు మాత్రం రాధా పార్టీలో చేరడం ఖాయమని, ఎమ్మెల్యేగా ఆయన గెలిచి, టీడీపీ అధికారంలోకి వస్తే, మంత్రి పదవిని కూడా ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని ప్రచారం సాగుతోంది. అదే హామీని వంగవీటి రాధాకు ఇచ్చారని అంటున్నారు. చంద్రబాబు దావోస్ నుంచి రాగానే టీడీపీలో చేరుతారని ప్రచారం సాగింది.
వంగవీటి రాధా స్పష్టత ఇవ్వాలి
కానీ దీనిపై వైసీపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ఇదంతా టీడీపీ గేమ్ ప్లాన్ అని చెబుతున్నారు. గతంలో నంద్యాల ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత నగరి ఎమ్మెల్యే రోజా కూడా టీడీపీలోకి వస్తారని ప్రచారం సాగిందని గుర్తు చేస్తున్నారు. అయితే వంగవీటి రాధా దీనిపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది.