జగన్ పద్ధతి మార్చుకో, చంపేస్తామంటున్నారు.. చంపేయండి: వంగవీటి రాధాకృష్ణ
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా తన క్యారెక్టర్ను చంపేశారని ఆరోపించారు. అందుకే తాను ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రజా జీవితంలో కొనసాగాలని అనుకుంటున్నానని చెప్పారు.
తమ్ముడి కంటే ఎక్కువ అని చెప్పారు
తాను వైసీపీలో చేరేటప్పుడు తనను సొంత తమ్ముడి కంటే ఎక్కువ అని జగన్ చెప్పారని గుర్తు చేసుకున్నారు. తన తండ్రి ఆశయాల సాధన కోసం తాను వైసీపీలో అన్నీ భరించానని చెప్పారు. తన తండ్రిని అన్ని పార్టీల వారు అభిమానిస్తారని చెప్పారు. వైసీపీలో తనకు జరిగిన అవమానాలు ఇతరులకు జరగకూడదన్నారు. తన తండ్రి విగ్రహావిష్కరణకు వెళ్లేందుకు తాను ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. కానీ ఎవరి పర్మిషన్ తీసుకొని వెళ్లాలని వారు నిలదీశారన్నారు.
జగన్ పద్ధతి మార్చుకో
తన తండ్రి విగ్రహావిష్కరణ కోసం ఎవరి అనుమతి తీసుకోవాలో తనకు అర్థం కావడం లేదని వంగవీటి రాధాకృష్ణ అన్నారు. ఇది ప్రజల్లో ఉన్న అభిమానమని, తమకు ఎవరూ జాలి చూపించాల్సిన అవసరం లేదన్నారు. జగన్ తన పద్ధతిని మార్చుకొని వంగవీటి రంగా అభిమానులను గౌరవించాలన్నారు. ఇప్పటికైనా జగన్ తన అభిప్రాయం మార్చుకోవాలని చెప్పారు. తనను చంపేస్తామని కూడా కొందరు బెదిరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు. తాను తాడు బొంగరం లేనివాడిని అను చంపేయాలనుకుంటే హ్యాపీగా చంపేసుకోండని అన్నారు. తనకు తన తండ్రి ఆశయాలు ముఖ్యమని చెప్పారు.
వైసీపీలో చేరేటప్పుడే నా తండ్రి ఆశయం గురించి చెప్పా
పేద ప్రజలు బాగుండాలని తన తండ్రి పోరాడి, ప్రాణాలు ఇచ్చారని వంగవీటి రాధా చెప్పారు. తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే రాజీనామా చేశానని స్పష్టం చేశారు. ఎలాంటి ఆంక్షలు లేని రాజకీయ జీవితం కోసమే రాజీనామా చేసినట్లు తెలిపారు. వైసీపీని వీడటానికి గల కారణాలు తాను ముందే చెప్పానని అన్నారు. తన తండ్రి ఆశయం ముఖ్యమని నేను నిర్ణయించుకున్నానని చెప్పారు. వైసీపీలో చేరేటప్పుడే తన తండ్రి ఆశయం గురించి జగన్కు చెప్పానని అన్నారు.
మీ సోషల్ మీడియా దాడులకు భయపడను
ఒక ఎమ్మెల్యేకు గౌరవం ఇవ్వలేని పార్టీలో తాను ఎందుకు ఉండాలని వంగవీటి రాధాకృష్ణ ప్రశ్నించారు. మీ సోషల్ మీడియా దాడులకు నేను భయపడి పారిపోయేది లేదని వైసీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వైసీపీ వాళ్లు రకరకాల గ్రూపులు క్రియేట్ చేశారని, కొంతమంది బెదిరింపులకు దిగుతున్నారని, చంపేస్తామని అంటున్నారని అన్నారు. నేనే సర్వస్వం, నేను చెప్పిందే వేదం అనే వైఖరి జగన్ది అని దుయ్యబట్టారు. తన వాళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత తనకు ఉందని చెప్పారు. టీడీపీ వాళ్లు పార్టీలోకి రావాలని తనను ఆహ్వానించారని చెప్పారు.