వంగవీటి రంగా హత్య, చంద్రబాబు: ముందే తెలిస్తే చెప్పలేదేం.. జోగయ్యకు గాలి కౌంటర్
హైదరాబాద్: కేవలం పుస్తకం అమ్ముకునేందుకే హరిరామజోగయ్య అసత్యాలు రాశారని తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు సోమవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వంగవీటి రంగా హత్యలో చంద్రబాబు ప్రమేయం ఉందని ఆరోపించే ప్రయత్నం హరిరామ జోగయ్య చేశారు.
దీనిపై గాలి ముద్దుకృష్ణమ ఈరోజు కౌంటర్ ఇచ్చారు. హరిరామజోగయ్య '60 వసంతాల నా రాజకీయ ప్రస్థానం' పుస్తకంలో చంద్రబాబు, వంగవీటి రంగా హత్య విషయమై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై గాలి స్పందిస్తూ... పుస్తకం అమ్ముకునేందుకు ఇలాంటివి చేస్తున్నారన్నారు.
వైసిపి నేత జోగయ్య ఒత్తిడిలో ఉన్నారని, తాను రాసుకున్న స్వీయ చరిత్ర పుస్తకానికి ప్రచారం కోసంవివాదాస్పద అంశాలను ఎంచుకున్నారన్నారు. రంగా హత్య అంశం ముందే తెలిస్తే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. రంగా హత్యకు టిడిపికి సంబంధం లేదన్నారు. రంగా హత్యకు రెండు కుటుంబాల గొడవ కారణమన్నారు.
గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విభజన ఉద్యమాలను ప్రోత్సహించేదని, ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆ పని చేస్తోందని ధ్వజమెత్తారు. అమరావతిలోనే అభివృద్ధి అంటూ దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.
నిత్యావసర ధరల పెరుగుదలపై వైసిపి ఆందోళన
ఏపీలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోమవారం ఆందోళనలు చేశారు. కడప జిల్లాలోని రైల్వే కోడూరు తహసీల్దారు కార్యాలయం ఎదుట వైసిపి ఎమ్మెల్యే శ్రీనివాసులు ఆధ్వర్యంలో ధర్నా చేశారు.
పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని కోరుతూ ప్రకాశం జిల్లా గిద్దలూరు తహసీల్దారు కార్యాలయం ఎదుట వైసిపి ఎమ్మెల్యే అశోక్ రెడ్డి నేతృత్వంలో కార్యకర్తలు ఆందోళన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఆందోళనలు, ధర్నాలు నిర్వహించారు.