వంగవీటి రంగా బావమరిది కీలక నిర్ణయం: టీడీపీలో చేరుతున్నారా?..
విజయవాడ: ఆదివారం ఐవీ ప్యాలెస్లో నిర్వహించిన రాధా, రంగా మిత్రమండలి ఆత్మీయ సమావేశంలో తన రాజకీయ భవిష్యత్తుపై చెన్నుపాటి శ్రీను స్పష్టతనిచ్చారు. రాధా రంగా మిత్రమండలి సభ్యుడైన శ్రీను, వంగవీటి రంగాకు బావమరిది. రెండు రోజుల్లో తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం ప్రకటిస్తానని ఆయన వెల్లడించారు.
రంగా, రాధాల ఆశయ సాధన కోసం
రంగా, రాధాల ఆశయ సాధన కోసం పాటుబడే పార్టీకే తాను చేరువవుతానని చెప్పారు. ఏ నిర్ణయం తీసుకున్నా రంగా, రాధా మిత్రమండలి అభిప్రాయం మేరకే తీసుకుంటానని తెలిపారు. రాధా, రంగ మిత్రమండలి సభ్యులకు అభిమానులు, స్నేహితులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి రాధా, రంగాలు ఎంతో కృషిచేశారని ఈ సందర్భంగా శ్రీను గుర్తుచేశారు.
కాగా, విజయవాడలో నిర్వహించిన ఈ సమావేశానికి రెండువేలకు పైగా సభ్యులు హాజరైనట్టు సమాచారం. సమావేశంలో కాపు సంఘం నేతలు పిళ్ళా వెంకటేశ్వర్లు, యు. సత్యనారాయణ, కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
టీడీపీలోనే చేరుతున్నారా?:
రెండు రోజుల్లో కీలక నిర్ణయం చెబుతానన్న చెన్నుపాటి శ్రీను.. తెలుగుదేశం పార్టీలో చేరడం దాదాపుగా ఖరారైందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆదివారం నాటి రాధా, రంగా మిత్రమండలి సమావేశానికి టీడీపీకి చెందిన నేతలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పైగా ఈ సమావేశానికి తెర వెనుక అన్ని ఏర్పాట్లు చేసింది టీడీపీయే అన్న ప్రచారం కూడా జరుగుతోంది. అతని అనుచరులు చెబుతున్న ప్రకారం.. జూన్ 7వ తేదీన సీఎం చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరుతారని సమాచారం.
వైసీపీలోనే రాధా:
ఏళ్లుగా వంగవీటి కుటుంబానికి అండగా ఉంటూ వస్తున్న చెన్నుపాటి శ్రీను.. ఇప్పుడు టీడీపీలో చేరాలనుకోవడం చర్చనీయాంశమైంది. వంగవీటి రాధా వైసీపీలో కొనసాగుతున్నవేళ.. శ్రీను మాత్రం టీడీపీ వైపు చూడటం గమనార్హం. వంగవీటి అనుచరుల్లో శ్రీనుకు వివాదరహితుడు అన్న పేరు కూడా ఉంది. అయితే మొన్నామధ్య కాల్ మనీ కేసులో ఆయనపై కూడా ఆరోపణలు వచ్చాయి.
విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ?
వచ్చే ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకే ఆయన టీడీపీలో చేరుతున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన బోండా ఉమా కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతే. ఎమ్మెల్యేగా ఆయన పలు వివాదాల్లో ఇరుక్కున్నారు. ఈ కారణంగా ఆయనకు విజయవాడ సెంట్రల్ నుంచి టికెట్ నిరాకరిస్తే.. అది చెన్నుపాటి శ్రీనుకే దక్కుతుందని తెలుస్తోంది.