వంగవీటి రంగా విగ్రహం ధ్వంసం: 'కాపుల్ని రెచ్చగొట్టే రాజకీయ కుట్ర'
విజయవాడ: కృష్ణా జిల్లాలో ఆదివారం నాడు ఉద్రిక్తత తలెత్తింది. మచిలీపట్నంలోని స్వర్గీయ వంగవీటి రంగా విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో ఉదయం కృష్ణా జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ధ్వంసం చేసిన విగ్రహం వద్ద కాపు నేతలు బైఠాయించారు.
ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ వారు డిమాండ్ చేస్తున్నారు. అక్కడే కాకుండా పలు ప్రాంతాల్లో కాపు సంఘాల నేతలు ధర్నాలకు దిగారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులను భారీగా మోహరించారు. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.
ఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్తో పరిశీలించిన పోలీసులు, నిందితులను గుర్తించేందుకు సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్, నూజివీడు తదితర ప్రాంతాల్లో కాపు యువత, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రోడ్లను దిగ్బంధించారు.
రాజకీయ కుట్ర: వీంద్ర
దివంగత వంగవీటి మోహన రంగా విగ్రహ ధ్వంసం ఘటన వెనుక రాజకీయ కుట్ర దాగుందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. కాపులను రెచ్చగొట్టేందుకే ఈ ఘటనకు పాల్పడ్డారన్నారు. నిందితులు ఎంతటి వారైనా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
ధ్వంసమైన విగ్రహం స్థానంలోనే కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని చెప్పారు. కాపు వర్గం సంయమనంతో వ్యవహరించాలన్నారు. తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని, ఎక్కడా విధ్వంసాలకు పాల్పడవద్దని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు.
సత్తెనపల్లిలో ఉద్రిక్తత
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని రాజీవ్ గాంధీ కూరగాయల మార్కెట్ వద్ద ఆదివారం ఉదయం అధికారులు పోలీసుల సహాయంతో అక్రమ కట్టడాలు తొలగించారు. దీంతో ఆగ్రహించిన స్థానికులు అధికారులను అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.