వైసీపీలోకి వంగవీటి రీ ఎంట్రీ : కొడాలి నాని చర్చలు- బంపరాఫర్ : ఆ షరతుకు ఓకే అంటేనే..!!
బెజవాడ రాజకీయాల్లో కీలక సమీకరణాలు చోటు చేసుకోబోతున్నాయి. వైసీపీ అధినేత పైన అలిగి పార్టీ వీడిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా తిరిగి వైసీపీలోకి రీ ఎంట్రీ దాదాపు ఖాయమైంది. విజయవాడ- క్రిష్ణా జిల్లాలతో పాటుగా సమీప జిల్లాల్లో వంగవీటి రాధా తండ్రి రంగా పైన ఇప్పటికీ అభిమానం కనిపిస్తోంది. ఆయన వారసుడిగా రాధాకు రాజకీయంగా మంచి మద్దతు లభించేది. అయితే, రాధా రాజకీయంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలతో ఆయన అనుచర వర్గం సైతం కొంత డైలమాలో ఉంది. ఇక, ఇప్పుడు రాధా మిత్రుడు..మంత్రి కొడాలి నాని తాజాగా చేస్తున్న ప్రయత్నాలు కొత్త సమీకరణాలకు కారణమవుతున్నాయి.
బెజవాడ కేంద్రంగా వంగవీటి రాజకీయం
2009 లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి రాధా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగారు. ఇక, 2009 ఎన్నికల సమయంలో చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం లో చేరారు. ప్రజారాజ్యం నుంచి విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి మల్లాది విష్ణు చేతిలో పరాజయం పాలయ్యారు. ఇక, జగన్ సొంతంగా పార్టీ ఏర్పాటుతో ఆయన కు రాధా మద్దతుగా నిలిచారు. వైసీపీలో చేరారు. 2014 లో వైసీపీ నుంచి విజయవాడ తూర్పు అభ్యర్ది గా పోటీ చేసినా మరో సారి ఓటమి తప్పలేదు. టీడీపీ అభ్యర్ది గద్దే రామ్మోహన్ ఆ ఎన్నికల్లో రాధా మీద గెలుపొందారు. తరువాత కొంత కాలం వైసీపీలోనే రాధా కొనసాగారు.
వైసీపీ నుంచి టీడీపీకి వెళ్తూ..జగన్ పై ఆరోపణలు
అయితే, 2019 ఎన్నికలు సమీపిస్తున్న వేళ ..టీడీపీ నేతల నుంచి రాధాకు ఆహ్వానం అందింది. క్రిష్ణా జిల్లా టీడీపీ నేతలు వరుసగా ఆయనతో భేటీలు జరిపారు. ముఖ్యమైన బాధ్యతలు అప్పగించటంతో పాటుగా కీలక పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. అనేక తర్జన భర్జన తరువాత రాధా వైసీపీని వీడారు. పార్టీని వీడే సమయంలో జగన్ వ్యక్తిత్వం గురించి..పార్టీలో జరిగిన పరిణామాల గురించి రాధీ ఆరోపణలు చేసారు. కానీ, వైసీపీ నుంచి నాటి రాధా ఆరోపణల పైన ప్రస్తుత మంత్రి పేర్ని నాని స్పందించారు.
వైసీపీ నుంచి ఆచితూచి స్పందన
రాధా పైన జగన్ కు అభిమానం ఉందని.. ఆయన పార్టీ వీడటం ఆయన ఇష్టమని చెబుతూనే..చంద్రబాబును మాత్రం నమ్మవద్దని సూచించారు. ఇక, ఆ సమయం లో రాధా వైసీపీలోనే ఉంటే మచిలీపట్నం ఎంపీ టిక్కెట్ ఇవ్వాలని జగన్ భావించినట్లుగా చెబుతారు. ఇక, టీడీపీలో చేరిన రాధాకు పార్టీ ఇచ్చిన ఏ హామీ అమలు కాలేదు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున ఆయన ప్రచారం చేసారు. ఇక, 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో..టీడీపీలోనే కొనసాగుతున్న రాధా అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతుగా పలు మార్లు వారి ఆందోళనల్లో పాల్గొన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని తప్పు బట్టారు.
రాధాను వైసీపీలోకి తెచ్చేందుకు కొడాలి నాని ప్రయత్నాలు
వైసీపీలో రాధా ను తిరిగి తీసుకొచ్చేందుకు మంత్రి పేర్ని నాని ప్రయత్నాలు చేసారు. ఈ ఏడాది డిసెంబర్ వరకు తనకు సమయం ఇవ్వాలంటూ అప్పట్లోనే రాధా చెప్పినట్లుగా తెలిసింది. అయితే, తాజాగా ఆదివారం గుడివాడలో చోటు చేసుకున్న పరిణామాలతో వైసీపీలోకి రాధా రీ ఎంట్రీ దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. గుడివాడ వైసీపీ నాయకుడు పాలేటి సుబ్రహ్మణం మనవడి పుట్టిన రోజు వేడుకల్లో మంత్రి కొడాలి నానితో పాటు వంగవీటి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఇద్దరూ పరస్పరం పలకరించుకున్నారు.
సీఎం ఒప్పిస్తానంటూ పదవి పై నాని హామీ
మంత్రి కొడాలి నాని, వంగవీటి రాధా మంత్రి కొడాలికి చెందిన కె కన్వె న్షన్ అతిథి గృహంలో రెండు గంటల పాటు సమావేశమయ్యారు. వైసీపీలోకి వస్తే ఎమ్మెల్సీ పదవితో పాటుగా రాజకీయ భవిష్యత్ పైన సీఎం ను ఒప్పిస్తానంటూ రాధాను ఆయన మిత్రడు..మంత్రి కొడాలి నాని ఆఫర్ ఇచ్చారు. రాధా సన్నిహితులు సైతం ఈ ప్రతిపాదన పైన అంగీకరించాల్సిందిగా సూచించినట్లు తెలుస్తోంది. దీంతో..రాధా సైతం మొత్త బడ్డారని చెబుతున్నారు. అయితే, రాధా ఆ చర్చల్లో ఒక కండీషన్ పెట్టారని విశ్వసనీయ సమాచారం.
రాధా మనసులో అదే నియోజకవర్గం
తనకు విజయవాడ సెంట్రల్ ఇవ్వాలని..ఆ విధమైన హామీ ఇస్తే తాను నిర్ణయం తీసుకుంటానంటూ చెప్పినట్లుగా తెలుస్తోంది. అందుకు అంగీకరిస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణ కు సీఎం ఏరకంగా హామీ ఇస్తారనేది మరో ఆసక్తి కర అంశం. దీంతో..తాను సీఎంతో చర్చించి..ముందుగా ఎమ్మెల్సీ పదవికి ఒప్పిస్తానని మంత్రి హామీ ఇచ్చారని చెబుతున్నారు. అయితే, వంగవీటి రాధా టీడీపీలో చేరటంతో అప్పటి వరకు టీడీపీలో ఉంటూ..గత ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీ చేసిన దేవినేని అవినాశ్ ఆ పార్టీ వీడి వైసీపీలో చేరారు.
Recommended Video
సీఎం జగన్ నిర్ణయం ఆధారంగా ఫైనల్ డెసిషన్
వచ్చే ఎన్నికల్లో విజయవాడ తూర్పు టిక్కెట్ ఆశిస్తున్నారు. ఇక, ఇప్పుడు తిరిగి రాధా వైసీపీలోకి వస్తే అవినాన్ వైసీపీలోనే కంటిన్యూ అవుతారా లేదా అనేది మరో చర్చ. అయితే, రాధా వైసీపీ లోకి రీ ఎంట్రీ మాత్రం ఖాయమని వైసీపీ నేతలు గట్టిగా చెబుతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి ముహూర్తం ఖరారు కానుందని తెలుస్తోంది. రానున్న ఎన్నికల పైన ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టిన సీఎం జగన్ పార్టీలో చేరికలు..టీడీపీ నుంచి ముఖ్య నేతలకు హామీల పైన కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. దీంతో..ఇప్పుడు వైసీపీలోకి రాధా రీ ఎంట్రీ ఇష్యూ వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది.