కడప టీడీపీలో చిచ్చు: జగన్తో టచ్లో సీఎం రమేష్.. వరదరాజులురెడ్డి సంచలనం, కారణమిదేనా?
కడప: టీడీపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ పైన ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి శనివారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీలో పలుచోట్ల వర్గ విభేదాలు అప్పుడప్పుడు వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు కడప జిల్లాలో సీఎం రమేష్, వరదరాజులు రెడ్డి మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. వరదరాజులు రెడ్డి సంచలన వ్యాఖ్యలతో మీడియాకు ఎక్కారు.
సీఎం రమేష్కు ఎన్నికల్లో గెలిచే సత్తా లేదన్నారు. ఆయన స్థాయి పంచాయతీకి ఎక్కువ, మండలానికి తక్కువ అన్నారు. అసలు రమేష్కు ఎన్నికల్లో గెలిచే సత్తా లేదన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దయవల్లే సీఎం రమేష్ రాజ్యసభ ఎంపీగా అయ్యారని చెప్పారు.
సీఎం రమేష్ జిల్లాలో గ్రూపులు కట్టి పార్టీలో చిచ్చు రేపుతున్నారని ధ్వజమెత్తారు. నామినేటెడ్ పదవులతో పబ్బం గడిపే సీఎం రమేష్కు జిల్లాలో వర్గ రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు. ఆయన ఫ్యాక్షన్ కుటుంబం నుంచి వచ్చి టీడీపీలో చిచ్చు రేపుతున్నారని ధ్వజమెత్తారు. సీఎం రమేష్ వర్గ రాజకీయాలతో చిచ్చు పెట్టడంతో పాటు అభివృద్ధిని కూడా అడ్డుకుంటున్నారని చెప్పారు.
జగన్తో సంబంధాలు కలిగి ఉన్నారని, వైసీపీతో సంబంధాలతో జిల్లాలో టీడీపీని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. సీఎం రమేష్ ఏమైనా దాదా అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. కుందు, పెన్నా నదుల్లో 5 శాతం వాటా ఎందుకివ్వాలన్నారు.
కాగా, గత నాలుగేళ్లుగా వీరి మధ్య అంతర్గతంగా విభేదాలు ఉన్నాయని తెలుస్తోంది. రెండేళ్ల క్రితం ఓ ఉప ఎన్నిక సమయంలోను విభేదాలు బయటపడ్డాయి. ఇరువురికి వ్యాపార సంబంధ వైరాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. తనకు కాలువ తవ్వకాల బిల్లు చెల్లింపులను సీఎం రమేష్ అడ్డుకుంటున్నారనే ఆగ్రహం వరదరాజులు రెడ్డికి ఉందని అంటున్నారు. అంతేకాకుండా తన అనుచరుడు, లింగారెడ్డితో చెక్ పెట్టేందుకు పావులు కదుపుతున్నారని అంటున్నారు.