వీడిన మిస్టరీ.. కాశీ యాత్రకు వెళ్ళిన ఆ ఏడుగురు సేఫ్
పుణ్యక్షేత్రాల దర్శనానికి బయలుదేరిన వ్యక్తుల బృందం అదృశ్యమైపోవడం ఉత్కంఠను రేపిన విషయం తెలిసిందే. అసలు కారణాలేంటో ఇంతవరకు తెలియరాలేదు గానీ.. ముందుగా, బృందంలోని ఒక యువకుడు చెప్పిన దాని ప్రకారం యాత్ర కాస్త పెద్ద మిస్టరీగా మారిపోయింది. సగం యాత్ర కూడా పూర్తవకుండానే దర్శనానికి వెళ్లిన బృందంలో ఒక్క వ్యక్తి తప్ప మిగిలినవారంతా అదృశ్యమయ్యారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి కాశీ యాత్రకు బయల్దేరి వెళ్లిన భక్తుల బృందంలో ఏడుగురు వ్యక్తులు ఏమైపోయారో ఆచూకీ తెలియలేదు. బృందంలోని ఒక యువకుడు మాత్రం తలకు తీవ్రమైన గాయాలతో వారణాసి ప్రభుత్వాస్పత్రిలో చేరాడు.
వివరాల్లోకి వెళ్తే.. కాకినాడలోని గొల్లపేట ప్రాంతానికి చెందిన 8 మంది కాశీ యాత్ర కోసం బయలుదేరారు. ముందుగా సామర్లకోట నుంచి విజయవాడ వెళ్లిన బృందం, అక్కడినుంచి రైల్లో వారణాసికి బయల్దేరారు. వీరిలో ఆరుగురూ మహిళలే కావడం గమనార్హం. మే 1వ తేదీ ఉదయం సరిగ్గా 12 గంటల ప్రాంతంలో బృందమంతా కాశీకి చేరుకున్నారు. అక్కడ త్వరగా దర్శనం చేసుకుని అక్కడినుంచి నేరుగా గయాకు వెళ్ళాలని భావించారు. కానీ కాశీలో దర్శనం ఆలస్యం కావడం వల్ల రాత్రి 11 గంటల సమయంలో అంతా కలిసి గయాకు ఒక వాహనంలో బయల్దేరారని ఆ యువకుడు తెలిపాడు.
గయాకు వెళ్తున్న సమయంలో ఇంకో వాహనమేదో తమ వాహనాన్ని వెంబడించిందని, అందులోని వ్యక్తులే తమవాళ్లందరినీ చంపేశారని బృందంలో ఇప్పుడు మిగిలి ఉన్న లోవరాజు అనే యువకుడు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. వారణాసి ప్రభుత్వాస్పత్రిలో తనకు చికిత్స అందిస్తున్న వైద్యుడి సెల్ ఫోన్ ద్వారా బంధువులకు సమాచారం అందించాడతను. విషయం తెలియగానే ఆందోళనపడ్డ బంధువులు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ అరుణ్కుమార్ను ఆశ్రయించారు. తక్షణం స్పందించిన కలెక్గర్ చికిత్స కాశీలో లోవరాజుకు చికిత్స అందిస్తున్న వైద్యులతో ఫోన్ లో మాట్లాడారు.
కాగా.. తలకు తీవ్రమైన గాయంతో చికిత్స పొందుతున్న లోవరాజు.. తన కళ్లముందే దుండగులు అందరిని హత్య చేశారని చెప్పడం.. లోవరాజు సమాచారం ఇచ్చిన తర్వాత బృందంలోని మిగిలినవాళ్ల ఫోన్లకు ప్రయత్నించగా కొన్ని ఫోన్లు ఇప్పటికీ రింగవుతూనే ఉండడం బంధువులు మరింత కంగారుపడ్డారు. ఇదిలా ఉంటే.. మిస్సయ్యారని భావిస్తున్న ఆ ఏడుగురు తిరిగి ఫోన్ చేయడంతో బంధువులంతా ఊపిరి పీల్చుకున్నారు. తామంతా క్షేమంగానే ఉన్నామని ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలియజేశారు.
తలకు గాయం కావడంతో మతి భ్రమించిన లోవరాజు తప్పుడు సమాచారం ఇచ్చాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు గొల్లపేట గ్రామస్తులు. లోవరాజును వారాణాసి ప్రభుత్వాసుపత్రిలో ఎవరు చేర్చారనేది కూడా ఇంతవరకు తెలియరాలేదు.