చంద్రబాబు ‘పీకే ముఖ్యమంత్రే’: వరప్రసాద్ తీవ్ర విమర్శలు
అనంతపురం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ వరప్రసాద్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 'మనం ఇప్పుడు కూడా నడుం కట్టకపోతే చంద్రబాబు దుష్టపాలన అంతం కాదు' అని ధ్వజమెత్తారు.
Recommended Video
ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా సోమవారం అనంతపురంలోని ఆర్ట్స్ కాలేజీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 'వంచనపై గర్జన దీక్ష' చేపట్టారు.
చంద్రబాబు పీకే ముఖ్యమంత్రే..
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత 10 లక్షల పింఛన్లు, మరో 10 లక్షలు రేషన్ కార్డులు, 2 లక్షల కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించారని వరప్రసాద్ విమర్శించారు. ప్యాకేజీ కోసం చంద్రబాబు హోదాను తాకట్టు పెట్టారని విమర్శించారు వరప్రసాద్. 60 ప్రభుత్వ సంస్థలను మూసేసిన చంద్రబాబును కచ్చితంగా ‘పీకే ముఖ్యమంత్రి' అనొచ్చు అంటూ ధ్వజమెత్తారు మాజీ ఎంపీ వరప్రసాద్. ఆయన ఒక పిరికిపంద అని ఏ ఒక్కసారన్నా సొంతంగా ముఖ్యమంత్రి అయ్యారా? అని ప్రశ్నించారు.
చంద్రబాబు ఎన్ని డ్రామాలో
పదిహేనేళ్లు ప్రత్యేకహోదా కావాలని అడిగి ఆ తర్వాత ప్యాకేజ్ సరిపోతుందని చెప్పి.. మళ్లీ ఇప్పుడు ప్రత్యేకహోదా కావాలని డ్రామాలాడుతున్నారని విమర్శించారు. ముగ్గురు వైయస్సార్సీపీ ఎంపీలు, 23 మంది ఎమ్మెల్యేలను కొన్నారని వరప్రసాద్ ఆరోపించారు. పార్టీ ఫిరాయించిన వైయస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను ప్రజలు ఎన్నటికీ క్షమించరన్నారు.
ముఖ్యమంత్రా? టీడీపీ అధ్యక్షుడా?
విభజన చట్టాన్ని చంద్రబాబుకు సత్తా ఉంటే అమలు చేయించాలి లేదంటే మిన్నకుండాలని సూచించారు. ముఖ్యమంత్రికి, టీడీపీ అధ్యక్షుడికి తేడా లేకుండా పోయిందని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాస్వామ్యంలో ఉన్నామని మర్చిపోయినట్లున్నారని వరప్రసాద్ ఎద్దేవా చేశారు. దళితుల పట్ల చంద్రబాబు గౌరవం లేదని, దళితులను అవమానించారని తెలిపారు. ఐదేళ్లలో ప్రతి కుటుంబానికి మేలు చేసిన వైయస్ రాజశేఖర్ రెడ్డి అసలైన ముఖ్యమంత్రి అని కొనియాడారు.
పిరికిపంద చంద్రబాబు
ఇది ఇలా ఉండగా, ప్రధాని మోడీ మోసం చేస్తే 40 ఏళ్ల అనుభవం ఉన్న టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎలా మోసపోయారని ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ప్రజలను రక్షించాల్సిన చంద్రబాబు తననే కాపాడాలంటూ ప్రజలను కోరడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ పెట్టిన అక్రమ కేసులకు వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి భయపడలేదని వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసుకు భయపడి హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన పిరికిపంద చంద్రబాబు అని ఎద్దేవా చేశారు.