ఏపీకి వెన్నుపోటు: మోడీ, బాబును ఏకేసిన వరప్రసాద్, రాజీనామాలు, ఆమరణ దీక్షపై జగన్
Recommended Video
న్యూఢిల్లీ/అమరావతి: భారతీయ జనతా పార్టీ, ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వరప్రసాద్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అవిశ్వాసం చర్చకు రాకుండా బీజేపీనే అడ్డుకుంటోందని ఆరోపించారు.
పార్లమెంటులో అవిశ్వాసంపై చర్చించాలనే చిత్తశుద్ధి బీజేపీకి లేదని వరప్రసాద్ అన్నారు. ఆయన సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
దేవుడిపై నమ్మకం లేదా?
ప్రధాని నరేంద్ర మోడీకి దేవుడిపై నమ్మకం ఉందా? లేదా? అని వరప్రసాద్ ప్రశ్నించారు. తిరుపతి దేవుడి సాక్షిగా హోదా ఇస్తామని ప్రకటన చేసిన మోడీ.. ఇప్పుడెందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. అధికారం కోసం అబద్దాలు చెబుతారా? అని ప్రశ్నించారు. రూ.15లక్షలు పేదవాడి ఖాతాలో వేస్తానని చెప్పిన మోడీ.. ఇప్పటి వరకు ఆ పని చేయలేదన్నారు. మోడీ కూడా అబద్ధాలపై అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. తాము రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని, కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని వరప్రసాద్ అన్నారు.
ఏపీకి వెన్నుపోటు పొడిచారు
బీజేపీ, టీడీపీలు కలిసి ఏపీకి వెన్నుపోటు పొడిచాయని వరప్రసాద్ ఆరోపించారు. తాము అవిశ్వాసం పెడితే తమ కలిసి వస్తామని, ఇప్పుడు మరో నాటకం ఆడుతున్నారని అన్నారు. బాబుకు 40ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని, 3సార్లు సీఎం అయ్యారని.. అయితే, మాట మార్చడం, అబద్ధాలు చెప్పడంలో మాత్రం ఆయన తర్వాతే ఎవరైనా అని వరప్రసాద్ విమర్శించారు.
అందుకే బాబు ఢిల్లీకి..
బీజేపీ, మోడీ ప్రభావం తగ్గుతోందని.. ఇతర పార్టీలను చంద్రబాబు కలుస్తున్నారని ఆరోపించారు. తన అవినీతిని కొనసాగించడానికే ఢిల్లీలో చంద్రబాబు రాజకీయాలు చేసేందుకు వస్తున్నారని ధ్వజమెత్తారు. నాలుగేళ్లుగా హోదా అడగని బాబు ఇప్పుడే ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. ఏపీ ప్రజల కోసం బాబు ఢిల్లీకి రావడం లేదని, రాజకీయ లభ్ది కోసమే వస్తున్నారని అన్నారు. హోదా వల్ల వచ్చే లాభాలు బాబుకు తెలియవా? అని చంద్రబాబును వరప్రసాద్ ప్రశ్నించారు. హోదా వల్లే ఏపీ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ప్యాకేజీ ఇవ్వలేదని బాబు ఇప్పుడు హోదా బాట పట్టారని అన్నారు.
మోడీని దెబ్బకొట్టేందుకే..
ఏపీ ఎంపీలమంతా రాజీనామాలు చేద్దామని వరప్రసాద్ పిలుపునిచ్చారు. అప్పుడే కేంద్రం దిగివస్తుందని అన్నారు. మంగళవారం అవిశ్వాస తీర్మానానికి అవకాశం ఇస్తే మాట్లాడతామని వరప్రసాద్ చెప్పారు. తాము భయపడేవాళ్లం కాదని అన్నారు. ఏపీని మోసం చేసిన బీజేపీని దెబ్బ కొట్టేందుకే ఆమరణ దీక్షకు దిగుతున్నామని వరప్రసాద్ అన్నారు. జగన్ పిలుపుతో బీజేపీ దిగివచ్చి హోదా ఇవ్వాలన్నారు. తమతోపాటు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేయాలని, దీక్షకు కూర్చోవాలని ఆయన అన్నారు.
రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు జగన్ పిలుపు
ప్రత్యేక హోదా, ఎంపీల రాజీనామా అంశాలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. యువత ఉద్యోగ ఆకాంక్షలకు ప్రతీక ప్రత్యేక హోదా..ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు, వైసీపీ శ్రేణులు ఆందోళనలు ఉధృతం చేస్తారని జగన్ తెలిపారు. హోదా కోసం విద్యార్థులు యూనివర్సిటీ క్యాంపస్ల్లో ఆందోళనలు నిర్వహిస్తారని, రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, వైసీపీ శ్రేణులు ప్రతి గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లాస్థాయిల్లో నిరాహార దీక్షలు చేపడతారని ఆయన పేర్కొన్నారు.
రాజీనామాలు, ఆమరణ దీక్ష
‘ప్రత్యేక హోదా మా(ఏపీ) హక్కు. హోదా ఇవ్వకపోతే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే వైసీపీ ఎంపీలు రాజీనామా చేసి.. ఏపీ భవన్లో ఆమరణ నిరాహార దీక్ష చేపడతారు. ఏపీ ప్రయోజనాలు, యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చంద్రబాబునాయుడు కూడా టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయించాలి. ప్రత్యేక హోదా కోసం వైసీపీ తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది' అని జగన్ స్పష్టం చేశారు.