‘తల లేని మొండెం, వక్షభాగం రక్తసిక్తం’: వరవరరావు కంటతడి
విశాఖపట్నం: ఏవోబీలో రెండ్రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్ బూటకమంటూ విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు, పౌరహక్కుల నేతలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మావోస్టులను పట్టుకుని ఎంతో అమానవీయంగా చంపేశారని మండిపడ్డారు.
బుధవారం వారు మీడియాతో మాట్లాడారు. 'ఓ మృతదేహానికి తల లేదు. ఇంకో దానికి ముఖం ఆనవాళ్లు లేవు. మరో మహిళ మృతదేహం వక్ష భాగం రక్తసిక్తం... ఇది ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టుల భౌతికకాయాల దయనీయ పరిస్థితి' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది పోలీసుల దుశ్చర్యే అంటూ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
కాగా, మల్కాన్గిరి ఎస్పీ కార్యాలయ ఆవరణంలోని కంటైనర్లో ఉంచిన పలువురు మావోయిస్టుల మృతదేహాలను మంగళవారం సాయంత్రం నుంచి కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగిస్తున్నారు. శవపరీక్షల అనంతరం నీలం రంగు సంచుల్లో చుట్టి అట్టపెట్టెలో ఉంచారు. పెట్టెపై నంబరు, మృతుడి ఫొటో, వివరాలు రాసిపెట్టారు.
సంబంధిత కుటుంబ సభ్యులు రాగానే ఆయా అట్టపెట్టెలను అంబులెన్స్ల్లో ఎక్కించాలని పోలీసులు నిర్ణయించారు. దీనిపై అనుమానంతో విరసం, పౌరహక్కుల సంఘ నేతలు అట్టపెట్టెలు తెరవాల్సిందేనని బుధవారం మల్కాన్గిరి ఎస్పీ ఎదుట నిరసనకు దిగడంతో మృతదేహాలు భద్రపరిచిన అట్టపెట్టెలు తెరవక తప్పలేదు. దీంతో పలువురు మావోయిస్టుల పట్ల పోలీసులు పైశాచికంగా వ్యవహరించిన తీరు బయటపడిందని విరసం నాయకుడు వరవరరావు అన్నారు.
20వ నంబరు అట్టపెట్టెలో భద్రపరిచిన మృతదేహం తల అందులో కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. దీంతో మృతదేహం ఎవరిదో గుర్తించలేకపోయామని తెలిపారు. అలాంటపు శవపరీక్ష ఎలా నిర్వహించారో అర్థం కాలేదన్నారు. మావోయిస్టులను అత్యంత కిరాతకంగా హింసించి హతమార్చినట్లు స్పష్టమవుతోందని వరవరరావు చెప్పారు. మహిళా మావోయిస్టులు మమత, భారతి వక్ష భాగాన్ని కత్తితో గాయపరిచిన తీరు తీవ్ర ఆవేదనను కలిగించిందన్నారు.
మరో మావోయిస్టు పీకేఎం ప్రభాకర్ అలియాస్ గంగాధర్ కాళ్లు విరిచేయడం, ముఖాన్ని గాయపరిచారని తెలిపారు. ప్రభాకర్ శరీరంలో నుంచి పేగులు బయటకు వేలాడడాన్ని గమనించామన్నారు. మావోయిస్టు నేత రామకృష్ణ కుమారుడు మున్నాపట్ల అత్యంత కిరాతకంగా పోలీసులు వ్యవహరించారని వాపోయారు.
గొంతు కోసేయడం, ముఖాన్ని నామరూపాల్లేకుండా చేయడం వంటి హింసాత్మక చర్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. దాదాపు అందరి మావోయిస్టుల పట్ల పోలీసులు పైశాచికంగా వ్యవహరించినట్లు వీటిని చూస్తే స్పష్టమవుతుందన్నారు. సజీవంగానే వీరిని అదుపులోకి తీసుకొని హత్యాకాండకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఎదురుకాల్పులపై మాకు అన్ని అనుమానాలే ఉన్నాయని చెప్పారు.
కన్నీరుమున్నీరయ్యారు
చనిపోయిన మావోయిస్టుల మృతదేహాల కోసం మల్కాన్గిరి ఎస్పీ కార్యాలయానికి వచ్చిన వారి కుటుంబాల రోదనలు మిన్నంటాయి. మృతదేహాలు రక్తపుమడుగుల మధ్య, గుర్తుపట్టలేని రీతిలో, తీవ్రమైన గాయాలతో కనిపించడంతో వారంతా కన్నీరుమున్నీరయ్యారు. ఆర్కే తనయుడు మున్నా తల్లి శిరీష, ప్రభాకర్ భార్య దేవెంద్ర, గణేశ్ భార్య దమయంతి కన్నీటిపర్యాంతమయ్యారు. మృతిచెందిన మావోయిస్టులకు నివాళులర్పించిన వరవరరావు, ప్రజా సంఘాల నేతలు కూడా కంటడిపెట్టారు.