వీడు మామూలు దొంగ కాదు...డాక్టర్ వేషంలో వచ్చి...దర్జాగా దోచుకెళ్లాడు...
తిరుపతి : తిరుపతిలో ఓ ఆస్పత్రిలో జరిగిన వెరైటీ దొంగతనం కలకలం సృష్టించింది. డాక్టర్ అవతారమెత్తిన ఓ చైన్ స్నాచర్ మహిళా పేషెంట్ నుంచి దర్జాగా నగలు దోచుకెళ్లడం సంచలనం సృష్టించింది. పోలీసులను సైతం విస్తు గొలిపిన ఈ ఘటన వివరాలివి...
ఏర్పేడు మండలం గుడిమల్లంకు చెందిన కాటూరి ఉదయ్ కుమార్ తన భార్య చికిత్స కోసం రెడ్డి అండ్ రెడ్డి కాలనీలోని గోపీమాధురి ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు ఆమెను 103వ నంబరు గదిలో ఉంచి ఆమె వైద్య సేవలు అందించారు. అయితే శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి డాక్టర్ తరహాలో వైట్ ఏఫ్రాన్ కోటు ధరించి ఆ గదిలోకి వెళ్లాడు. రోగికి చికిత్స చేయాలంటూ ఆమె కుటుంబసభ్యులను అందరిని బయటకు పంపించాడు. అనంతరం ఆమెకు చికిత్స చేస్తున్నట్లు నటించి మహిళ మెడలోని 50 గ్రాముల బంగారు గొలుసు తీసుకుని అక్కడ నుంచి పరారయ్యాడు.
అనంతరం మహిళ మెడలో బంగారు గొలుసు మాయం అవడాన్ని గమనించిన రోగి బంధువులు ఆస్పత్రి నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్నపోలీసులు అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. కాగా గొలుసు చోరీ చేసిన అనంతరం కూడా ఆ నకిలీ డాక్టర్ గది బయటే దర్జాగా ఫోన్ మాట్లాడుకుంటూ తాపీగా బయటకు వెళుతున్న సంఘటనలు సీసీ టీవీ ఫుటేజ్కు చిక్కాయి. ఆస్పత్రిలోని సీసీ కెమెరాల ఫుటేజీనని పరిశీలించిన పోలీసులు నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.