'లోకేష్కు మంత్రి పదవా?; అది రాజ్యాంగ ఉల్లంఘనే, అంతా అవినీతిమయం..'
అధికారంలో ఉన్నవాళ్లు రాజ్యాంగాన్ని అమలు చేయాల్సింది పోయి ఉల్లంఘించే స్థాయికి దిగజారిపోయారని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ విమర్శించారు.
అమరావతి: మొత్తానికి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ కొంతమంది టీడీపీ నాయకుల్లో అసంతృప్తిని రేకెత్తించింది. సామాజిక సమీకరణాలు, ప్రాంతీయత, తదితర అంశాలన్ని పరిగణలోకి తీసుకుని కొత్త మంత్రివర్గానికి రూపునిచ్చామని సీఎం చంద్రబాబు చెబుతున్నా.. నేతల్లో మాత్రం అసంతృప్తి సద్దుమణగడం లేదు.
వైసీపీ నుంచి వచ్చిన నేతలకు పెద్ద పీట వేయడం.. మంత్రివర్గంలో ఒక్క ముస్లిం ఎమ్మెల్యేను కూడా తీసుకోకపోవడంతో విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. పదవులపై ఆశలు పెట్టుకున్న చాలామంది ఎమ్మెల్యేలు బాహాటంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. కొంతమంది రాజీనామాల వరకు వెళ్లడం టీడీపీలో కలకలం రేపినా.. సీఎం స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
కాగా, ఏపీ మంత్రివర్గ విస్తరణపై పలు పార్టీల నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ, సీపీఎం రాఘవులు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మంత్రివర్గ విస్తరణపై స్పందించారు. వారి అభిప్రాయాల్లో కింది స్లైడ్స్ లో..
లోకెశ్కు మంత్రి పదవేంటి?:
సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ను మంత్రివర్గంలో చేర్చుకోవడం పట్ల సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కనీస రాజకీయ అనుభవం లేకుండా లోకేశ్ కు మంత్రిపదవి ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు కట్టబెట్టడాన్ని రాఘవులు తప్పుపట్టారు. విశాఖలోని సీపీఎం కార్యాలయంలో మాట్లాడుతూ మంత్రివర్గ విస్తరణపై ఆయన స్పందించారు. అవినీతిపరులకు మంత్రివర్గంలో స్థానం కల్పించి, దేశంలో తమ పార్టీనే అవినీతిలో అగ్రస్థానంలో ఉందన్న విషయాన్ని టీడీపీ నిరూపించుకుందన్నారు.
కాపులు ఇప్పుడు గుర్తొచ్చారా?:
మంత్రివర్గంలో తనకు స్థానం కల్పించకపోవడంతో కాపులకు అన్యాయం జరిగిందంటూ బోండా ఉమా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. కాపులు నీకు ఇప్పుడు గుర్తొచ్చారా? అని ముద్రగడ పద్మనాభం ఆయన్ను ప్రశ్నించారు. బోండా ఉమా లాంటి నేతలతో నిత్యం తమను తిట్టించడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.
చంద్రబాబు కుట్ర రాజకీయాలను ఇప్పటికైనా గుర్తించాలని ముద్రగడ సూచించారు. ఇచ్చిన హామి కోసం తాము పోరాడుతుంటే, ప్యాకేజీలకు అమ్ముడుపోయారని తమపై ఆరోపణలు చేస్తున్నారంటూ ముద్రగడ ఫైర్ అయ్యారు. జగన్ తో రాజకీయ అక్రమ సంబంధం అంటగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తో రాజకీయ సంబంధాన్ని చంద్రబాబు నిరూపించాలని, లేనిపక్షంలో రాజీనామా చేయాలని ముద్రగడ డిమాండ్ చేశారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పదవులా?:
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం దారుణమని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ వ్యాఖ్యానించారు. మంత్రివర్గ విస్తరణ కూర్పును ఆయన తప్పుపట్టారు. అధికారంలో ఉన్నవాళ్లు రాజ్యాంగాన్ని అమలు చేయాల్సింది పోయి ఉల్లంఘించే స్థాయికి దిగజారిపోయారని విమర్శించారు.
పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే పదవులు పోతాయని రాజ్యాంగం చెబుతుంటే.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రాజ్యాంగ ఉల్లంఘన యథేచ్చగా జరిగిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీని కుటుంబ ఆస్తిగా, ప్రభుత్వ వ్యాపారంగా మార్చేశారని అన్నారు.
అది పార్టీల ఇష్టం:
రాజకీయాల్లో నైతిక విలువలు ఆయా పార్టీల నిర్ణయంపై ఆధారపడి ఉంటాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు పేర్కొన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను మంత్రివర్గంలో చేర్చుకోవడం పట్ల విమర్శలు వెల్లువత్తుతున్న నేపథ్యంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. మంత్రివర్గ నియామకంపై సీఎంకు సర్వాధికారాలు ఉంటాయని, ఆ అధికారాలను బీజేపీ ప్రశ్నించదలుచుకోలేదని అన్నారు.
టీడీపీ తీరు అప్రజాస్వామికం:
వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పించడం అప్రజాస్వామికమని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను అభిప్రాయపడ్డారు. ఫిరాయింపుదారులతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ తమ పార్టీలో చేర్చుకున్నప్పుడు చంద్రబాబు రాజ్యాంగ విరుద్దం అంటూ విమర్శించారని, ఇప్పుడు అదే సంస్కృతిని ఆయన కూడా ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు.అవకాశవాద రాజకీయాలకు చంద్రబాబు నిలువెత్తు నిదర్శనమని అన్నారు. ఇటీవల విడుదలైన కాగ్ నివేదిక కూడా చంద్రబాబు అవినీతిని తేటతెల్లం చేస్తోందన్నారు.