కాంగ్రెస్ కాదు: డొక్కాకు వర్ల కౌంటర్, 'రెచ్చగొట్టడంలో.. వైయస్ దారిలో జగన్'
గుంటూరు: ఎస్సీ వర్గీకరణ పైన పూర్తి అవగాహన తెచ్చుకొని మాట్లాడాలని మంత్రి పత్తిపాటి పుల్లారావుకు మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ సూచించడంపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య శనివారం నాడు భగ్గుమన్నారు.
డొక్కా ఇంకా కాంగ్రెస్ సంస్కృతిలోనే ఉన్నట్లుగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీలో అన్ని కులాలకు చంద్రబాబే నాయకుడన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశం సున్నితమైందని, ఎస్సీల అభ్యున్నతికి తమ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించే బదులు దళితుల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను పరిశీలించాలని డొక్కాకు సూచించారు.
సున్నిత అంశం: రావెల కిషోర్
ఎస్సీ వర్గీకరణ చాలా సున్నితమైన అంశమని, దానిని రాజకీయం చేయవద్దని మంత్రి రావెల కిషోర్ బాబు సూచించారు. ఎస్సీ వర్గీకరణకు తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. గతంలో రెండుసార్లు శాసనసభలో తీర్మానం కూడా చేశామన్నారు.
దీనిపై పార్లమెంటులో చట్టసవరణ చేయాల్సి ఉందన్నారు. ఎస్సీల సంక్షేమం, దళితుల అభివృద్ధి కోసం టిడిపి పాటుపడుతోందన్నారు. ఒక్క ఏడాదిలోనే ఎస్సీ కార్పోరేషన్ ద్వారా రూ.వెయ్యి కోట్లు విడుదల చేశామని, ఎస్సీ కాలనీల్లో రహదారుల అభివృద్ధికి రూ.2 కోట్ల చొప్పున మంజూరు చేస్తున్నామన్నారు. 2018 నాటికి అన్ని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో రోడ్లను పూర్తి చేస్తామన్నారు.
తండ్రిలాగే కులాల మధ్య చిచ్చు పెడతారా?: టిడిపి
పదవుల కోసం కులాల మధ్య చిచ్చు పెట్టడం, మత విద్వేషాలను రెచ్చగొట్టడం వైయస్ కుటుంబం నైజమని టిడిపి నేత జివి ఆంజనేయులు శనివారం విమర్శించారు. మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర రెడ్డి హయాంలో జగన్ తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి పదవి కోసం మత విద్వేషాలను రెచ్చగొట్టి అమాయకుల ప్రాణాలను బలిగొన్నారని ఆరోపించారు.
తండ్రి బాటలోనే కుమారుడు జగన్ కూడా నడుస్తున్నారని ధ్వజమెత్తారు. మొన్నటికి మొన్న కాపు గర్జనలో అసాంఘిక శక్తులను ఉసిగొల్పి నానాబీభత్సం సృష్టించారన్నారు.
ఇప్పుడు మళ్ళీ దళితులను రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. దేశంలోని ముఖ్యమంత్రులకు ఆదర్శంగా ఉన్న చంద్రబాబును క్రిమినల్ అని జగన్ మాట్లాడటం విచారకరమన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ తన సీటు కూడా గెలిచే పరిస్థితి ఉండదని, ప్రజలు వైసిపిని బంగాళాఖాతంలో కలపడం ఖాయమన్నారు.