జగన్ కేసు నిలువదని ఎలా చెప్తారు: రమాకాంత్ రెడ్డిపై ఫైర్, 'పతనం ఇక్కడి నుంచే"
వైయస్ జగన్ మీద ఉన్న కేసులపై చేసిన వ్యాఖ్యలకు వర్ల రామయ్య రమాకాంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. కేసులు నిలబడవని ఎలా చెప్తారని అడిగారు.
విజయవాడ/ కడప: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై పెట్టిన కేసుల గురించి మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్ల రామయ్య మండిపడ్డారు. రిటైర్డ్ ఐఏఎస్ రమాకాంత్ రెడ్డి సీఎస్గా ఉన్నప్పుడే జగన్ అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.
జగన్పై ఉన్న కేసులు నిలబడవని మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డి వ్యాఖ్యానించడంపై వర్ల రామయ్య సోమవారం మీడితో మాట్లాడారు. జగన్కు సాయపడాలనే రమాకాంత్రెడ్డి కేసులపై మాట్లాడారని ఆయన అభిప్రాయపడ్డారు. జగన్పై కేసులు నిలబడవని ఆయన ఎలా చెబుతారని, మాజీ సీఎస్ చేసిన వ్యాఖ్యలు కేసు విచారణపై ప్రభావం చూపవా అని వర్ల రామయ్య ప్రశ్నించారు.
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభంజనానికి భయపడి వైయస్సార్ కాంగ్రెసు పా్రటీ ఎక్కడా ఎమ్మెల్సీ అభ్యర్థులను నిలపలేదని, కడపలో అభ్యర్థిని నిలబెట్టినా టిడిపి ఘనవిజయం సాధిస్తుందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. కడప జిల్లా నుంచే జగన్ పార్టీ పతనం ప్రారంభమవుతుందని జోస్యం చెప్పారు.
వైయస్సార్ కాంగ్రెసు పా్రటీ నేతలు ఎన్ని కుట్రలు పన్నినా తమ అభ్యర్థి 100 ఓట్ల ఆధిక్యంతో గెలుస్తాడని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా కడపలో టిడిపి స్థానిక సంస్థల అభ్యర్థి బీటెక్ రవి నామినేషన్కు మంత్రి గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు.
తమకు ప్రజాబలం ఉందని, అందుకే క్యాంపు రాజకీయాలు చేయడం లేదని మంత్రి అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు గెలవలేమన్న భయంతోనే ఓటర్లను ప్రలోభపెట్టి క్యాంపు రాజకీయాలకు పాల్పడుతున్నారని బీటెక్ రవి విమర్శించారు.