నాడు కృష్ణయ్య..నేడు రామయ్య: ఓడిపోతామని తెలిసీ.. చంద్రబాబు కులం కార్డు: టీడీపీలోనే..!
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఊహించని విధంగా రాజకీయ ఎత్తుగడ వేశారు. రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ తరఫున అభ్యర్థిని నిలిపారు. పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, ఆర్టీసీ మాజీ ఛైర్మన్, దళిత నేత వర్ల రామయ్యను బరిలో దింపారు. చంద్రబాబు ఉద్దేశమేంటో బోధపడట్లేదు గానీ.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని దళిత ఎమ్మెల్యేల్లో చీలిక తీసుకుని రావడానికి ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించారని చెబుతున్నారు.
స్థానిక పోరు: ఇంటి మీద జెండా ఎగిరినా సరే.. జీవితాంతం వెంటాడేలా కేసులు: పోలీసుల వార్నింగ్..!
గెలిచి అవకాశాలు లేకున్నా..
నిజానికి- రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఏ మాత్రం కూడా లేవు. విజయం సాధించే అవకాశాలు దరిదాపుల్లో కూడా లేవు. రాజ్యసభ అభ్యర్థి విజయం సాధించడానికి 45 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం అవుతాయి. ప్రస్తుతం టీడీపికి ఉన్న శాసనసభ్యుల బలం 23. అందులోనూ ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వారి రాజీనామాలు ఇంకా ఆమోదించనప్పటికీ.. టీడీపీ అభ్యర్థికి మాత్రం వారు ఓటు వేసే పరిస్థితి లేదు. ఫలితంగా 21కి దిగజారిందా సంఖ్య
నాడు ఆర్ కృష్ణయ్య తరహాలోనే..
2014లో రాష్ట్ర విభజన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇదే తరహాలో కులం కార్డును ప్రయోగించిన విషయాన్ని విశ్లేషకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా వెనుకబడిన వర్గానికి చెందిన ఆర్ కృష్ణయ్యను తెలుగుదేశం పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే బీసీ కులానికి చెందిన ఆర్ కృష్ణయ్యను ముఖ్యమంత్రిని చేస్తామని అప్పట్లో చంద్రబాబు ప్రకటించారు.
నేడు వర్ల రామయ్య..
తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమనే విషయం తెలిసి కూడా చంద్రబాబు ఆర్ కృష్ణయ్య పేరును ప్రతిపాదించడం వెనుక ఆయన కులాన్ని వాడుకునే ప్రయత్నం చేశారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే తరహాలో రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించలేమని తెలిసి కూడా చంద్రబాబు ఈ సారి దళిత కార్డును ప్రయోగించారనే విమర్శలు ఆరంభం అయ్యాయి. రాజ్యసభ ఎన్నికల్లో తాము దళిత నాయకుడిని నిలబెట్టామని, దళిత వ్యతిరేకి కావడం వల్లే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనను ఓడించిందని చెప్పుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుందని
Recommended Video
కులం కార్డు కోసమేనా..
ఈ పరిస్థితుల్లో చంద్రబాబు వర్ల రామయ్యను రాజ్యసభ అభ్యర్థిగా బరిలో దింపడం వల్ల ఫలితం ఉండకపోవచ్చని అంటున్నారు. దళిత కార్డును ఉపయోగించుకోవడానికి మాత్రమే చంద్రబాబు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని చెబుతున్నారు. చంద్రబాబు తీరు పట్ల సొంత పార్టీ నాయకుల్లో కూడా విస్మయం వ్యక్తమౌతోంది. నిజంగా వర్ల రామయ్యను రాజ్యసభకు పంపించాలనుకుంటే.. పార్టీకి బలం ఉన్నప్పుడు ఆ పని ఎందుకు చేయలేదనే అభిప్రాయాలు సొంత పార్టీలో వినిపిస్తున్నాయి.