ఎన్నికలయ్యే దాకా జగన్ అక్రమాస్తుల కేసు తొక్కిపెట్టే యత్నం: సీబీఐని లాగి వర్ల సంచలనం
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన చార్జీషీట్ దాఖలు చేసి ఏడు సంవత్సరాలు అయిందని తెలుగుదేశం పార్టీ నేత, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య గురువారం గుర్తు చేశారు. సీబీఐ, జగన్లు కలిసి ప్రయాణం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పటిష్టమైన సాక్ష్యాలు ఉన్న కేసును నీరుగారుస్తున్నారన్నారు.
టీడీపీకి భారీ షాక్: వైసీపీలోకి వర్ల రామయ్య సోదరుడు, జగన్ వైపు ఎందుకు వెళ్తున్నారు?
ఎన్నికలు పూర్తయ్యే వరకు జగన్ కేసు తొక్కిపెట్టే ఒప్పందం
బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలు వైయస్ జగన్కు ఎలాంటి హామీలు ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు కేసును తొక్కిపెట్టే ఒప్పందం జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు. నరేంద్ర మోడీ తన రాజకీయ లబ్ధి కోసం నేరస్తులతో కలుస్తారా అని ప్రశ్నించారు. సీబీఐ తెలుగు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ కేసు విషయమై సీబీఐ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
వర్ల రామయ్యకు షాకిచ్చిన అన్న
ఇదిలా ఉండగా, టీడీపీ సీనియర్ నేత అయిన వర్ల రామయ్య సోదరుడు వర్ల రత్నం (వర్ల రామయ్య అన్న) గురువారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వర్ల రత్నంతో పాటు పిడుగురాళ్లకు చెందిన వున్నం హాస్పిటల్ అధినేత వున్నం నర్సింహారావు, ఆయన కుమారుడు వున్నం నాగమల్లికార్జున రావులు జగన్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
పార్టీలు మారుతున్న నేతలు
సార్వత్రిక ఎన్నికలకు ముందు పలువురు నేతలు పార్టీలు మారుతోన్న విషయం తెలిసిందే. కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి కూడా ఈ రోజు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. కాంగ్రెస్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీ వైపు చూస్తున్నారు. మరికొందరు నేతలు జనసేన వైపు చూస్తున్నారు.