సీఆర్ 'యూజ్లెస్ ఫెలో' వ్యాఖ్యలు: మధ్యలోకి చిరుని లాగిన వర్ల
అమరావతి: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును యూజ్లెస్ ఫెలో అని వ్యాఖ్యానించిన సి. రామచంద్రయ్యపై తెలుగుదేశం పార్టీ నేతలు ఏకకాలంలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంతేకాదు ఒకవైపు రామచంద్రయ్య చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూనే కాంగ్రెస్ నేత చిరంజీవిని తెరపైకి తెచ్చారు.
మంగళవారం ఆయన ఇందిరా భవన్లో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు యూజ్లెస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇన్ ది స్టేట్ అని రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. చంద్రబాబు సీఎం పదవికి రాజీనామా చేసి, టీడీపీలో మరో సమర్థుడికి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
రామచంద్రయ్యే అతి పెద్ద యూజ్లెస్ ఫెలో అని ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ వర్ల రామయ్య అన్నారు. రామచంద్రయ్య దగ్గర సలహాలు తీసుకున్న వారు యూజ్లెస్ ఫెలోగా మారిపోతారని అన్నారు. చిరంజీవి రాష్ట్ర రాజకీయాల్లో యూజ్లెస్ ఫెలోగా మారిపోవడానికి ఈ యూస్లెస్ ఫెలో(రామచంద్రయ్య) ఇచ్చిన సలహాలే కారణమని రామయ్య ఎద్దేవా చేశారు.
చిరంజీవితో పార్టీ పెట్టించి, ఆయన్ను కూడా యూజ్లెస్ ఫెలో చేసిన ఘనత రామచంద్రయ్యదేనని అన్నారు. రామచంద్రయ్య మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. చంద్రబాబు వల్ల రెండుసార్లు రాజ్యసభకు వెళ్లి.. నేడు ఆయనపైనే అనుచిత వ్యాఖ్యలు చేయడం సీఆర్కు తగదని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ అన్నారు.
ఇదిలా ఉంటే ఏ సంబంధం లేదని చిరంజీవిని ఈ మాటల యుద్ధంలోకి తీసుకురావడానికి కారణం ఏమై ఉంటుందో అర్ధం కావడం లేదు. నిజానికి చిరంజీవి అంటే రామచంద్రయ్యకు అభిమానం ఎక్కువ. ఎవరైనా చిరును విమర్శిస్తే రామచంద్రయ్య ప్రతి ఘటిస్తుంటారు. దీంతోనే రామచంద్రయ్య యూజ్లెస్ ఫెలో వ్యాఖ్యల వ్యవహారంలోకి చిరుని లాగారని అంటున్నారు.