‘జగన్ అధికారిక నివాసం కూడా బినామీ పేరుతోనేనా?’: ఏపీ సీఎంను టార్గెట్ చేసిన టీడీపీ
అమరావతి: తెలుగుదేశం పార్టీ నేతలు ఏపీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతోపాటు దేవినేని ఉమామహేశ్వరరావు, దూళిపాళ్ల నరేంద్ర తీవ్ర విమర్శలు చేయగా.. తాజాగా వర్ల రామయ్య ఏపీ సీఎంను లక్ష్యం చేసుకుని ఆరోపణలు గుప్పించారు.
జగన్ నివాసం కూడా బినామీనేనా..
విజయవాడలో టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ.. తాడేపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారిక నివాసం బినామీల పేరుతో కట్టారని ఆరోపించారు. జగన్ కష్టార్జితంతో ఆ ఇల్లు కట్టారని టీడీపీ నేతలు చెప్పగలరా? అని ప్రశ్నించారు. ఇంటి మరమ్మతుల కోసం రూ. 42 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేశారని ధ్వజమెత్తారు. అలాంటి వ్యక్తులా అవినీతి నిరోధక శాఖను మందలించేది? అని వర్ల రామయ్య ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారులు జాగ్రత్తగా ఉండకపోతే భవిష్యత్తులో న్యాయస్థానంలో నిల్చుకోవాల్సి వస్తుందని వర్ల రామయ్య హెచ్చరించారు.
వారి ఫైల్స్ మాత్రమే క్లియర్ అవుతున్నాయి...
సరస్వతి పవర్ ప్రాజెక్టులో కూడా భారీ ఎత్తున అవినీతి జరుగుతోందన్నారు. సరస్వతి ప్రాజెక్టు కోసం రూ. 5వేల కోట్లు విలువ చేసే 1500 ఎకరాల భూమిని అప్పటి వైఎస్ ప్రభుత్వం కేటాయించిందని గుర్తు చేసిన ఆయన.. వైసీపీ అధికారంలోకి వచ్చాక జీవో నెంబర్ 109 ద్వారా 1500 ఎకరాలను తిరిగి సరస్వతి పవర్కు కేటాయించిందన్నారు. ప్రస్తుతం మైనింగ్ శాఖలో సీఎం, ఆయన బంధువుల ఫైల్స్ మాత్రమే క్లియర్ అవుతున్నాయని ఆరోపించారు.
నివేదిక రాకముందే ప్రకటనా?..
కుటుంబ ఆస్తులు పెంచుకోవడానికి జీవోలు ఇచ్చే జగన్మోహన్ రెడ్డికి.. రాజధానిని తరలించే హక్కు ఎవరిచ్చారని వర్ల రామయ్య నిలదీశారు. రాజధాని తరలింపుపై వేసిన కమిటీ నివేదికల రాకముందే వారెలా ప్రకటన చేస్తారని వర్ల రామయ్య ప్రశ్నించారు. రాజధానిగా అమరావతి కొనసాగాలన్నారు.
రాజధాని తరలింపునకు రహస్య జీవోలు..
ఇదిలావుంటే, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, ఆయన అనుచరులు విశాఖలో భూదందాలు జరుపుతున్నారని టీడీపీ నేత దేవినేని ఉమ ఆరోపించారు. ప్రజల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటారని అన్నారు. సీఎం జగన్ రాజధానిని విశాఖకు తరలించేందుకు రహస్య జీవోలు ఇస్తున్నారని ఆరోపించారు. అమరావతి రాజధానిలో సీఎం జగన్ ఇల్లు కట్టిన సంస్థలు కూడా అదే సమయంలో తాడేపల్లిలో భూములు కొన్నాయని, ఆ భూములను సేకరించిన వాళ్లు ఇన్ సైడర్ ట్రేడింగ్ చేసినట్లేనా? అని మరో టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు. తాడేపల్లిలో జగన్ బినామీలు భూములు కొన్నారా? లేదా? అని నిలదీశారు.