ఫ్రైడే సీఎంగా ఒకరిని పెట్టు , కోర్టుకు వెళ్లి కడిగిన ముత్యంలా బయటకు రా .. జగన్ పై వర్ల వ్యంగ్యం
ప్రతి శుక్రవారం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారణకు జగన్ మోహన్ రెడ్డి హాజరు కావాల్సి ఉండగా,ఆయన కేసులో విచారణకు హాజరు కాకపోవడంపై టిడిపి సీనియర్ నేత వర్ల రామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ కేసుల విచారణలో కోర్టుకు సహకరించాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు. కోర్టుకు వెళ్లకుండా తప్పించుకోవడం ఆపి త్వరగా విచారణ జరపాలని సీబీఐ కోర్టును జగన్ కోరాలని వర్ల రామయ్య పేర్కొన్నారు.
సీబీఐ ప్రత్యేక కోర్టుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ గైర్హాజరు... రీజన్ చెప్పిన న్యాయవాది
శుక్రవారం జగన్ కోర్టుకు హాజరు కాకపోవటంపై వర్ల రామయ్య వ్యంగ్యాస్త్రాలు
ప్రతి శుక్రవారం కోర్టుకు వస్తానని, రోజంతా ఉంటానని.. త్వరితగతిన కేసును విచారణ జరపాలని సీఎం జగన్ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని కోరాలని వర్ల రామయ్య సూచించారు. ఇక అంతే కాదు శుక్రవారం కోర్టుకు రావడానికి ఇబ్బందిగా ఉంది అంటున్న జగన్, ఫ్రైడే సీఎంగా ఎవరినైనా నియమించి తాను కోర్టుకు వెళ్లాలని సలహా ఇచ్చారు. గుంటూరులో మీడియా సమావేశంలో మాట్లాడిన వర్ల రామయ్య జగన్ కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుంటున్న విధానంపై చాలా వ్యంగ్యంగా మాట్లాడారు.
కోర్టులో కేసు త్వరగా విచారించాలని జగన్ కోరాలని చెప్పిన వర్లరామయ్య
వ్యక్తిగత మినహాయింపు ఇచ్చే ప్రసక్తే లేదని కోర్టు తేల్చి చెప్పిన ప్పటికీ కోర్టుకు వెళ్లకుండా తప్పించుకుంటున్న సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో ప్రతి శుక్రవారం వాయిదా వేయకుండా తప్పకుండా కోర్టుకు వెళ్లి తానేమిటో నిరూపించుకోవాలి అని సవాల్ విసిరారు వర్ల రామయ్య. సీఎం జగన్మోహన్ రెడ్డి తాను ఎలాంటి నేరాలు చేయనప్పుడు, తన మీద వచ్చిన వాటిని ఆరోపణలుగా భావిస్తున్నప్పుడు, త్వరితగతిన విచారణ జరపాలని కోర్టును కోరాలి. ఆ తర్వాత కడిగిన ముత్యంలా బయటకు రావాలని ఆయన సవాల్ చేశారు.
మరీ ఇన్నేళ్ల పాటు విచారణ కొనసాగితే ఎలా అంటూ జగన్ ను ప్రశ్నించిన వర్ల
తనపై వచ్చినవి ఆరోపణలు మాత్రమేనని సీఎం జగన్మోహన్ రెడ్డి నిరూపించుకోవాలి అన్నారు. తాను విచారణకు వెళితే ప్రభుత్వ పాలన సాగదని కుంటి సాకులు చెప్పి తప్పించుకోవద్దని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. ఇక అంతేకాకుండా న్యాయస్థానానికి జగన్ సహకరించాలని, ఊరికే విచారణ వాయిదా వేయడం సమంజసం కాదని చెప్పిన వర్ల రామయ్య, మరీ ఇన్నేళ్ల పాటు విచారణ కొనసాగితే ఎలా అంటూ ప్రశ్నించారు.
సీఎం జగన్ కేసుల నుండి నిర్దోషిగా బయటకువచ్చి నిరూపించుకో అన్న టీడీపీ నేత
ఏపీకి సీఎంగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి తనపై ఉన్న కేసుల నుండి నిర్దోషిగా బయటకు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అంతేకాదు అక్రమాస్తులు కూడబెట్టారన్న మచ్చను సీఎం జగన్మోహన్ రెడ్డి తొలగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం జగన్ త్వరగా విచారణ పూర్తి చేయాలని కోర్టును కోరి మరీ, విచారణకు సహకరించాలని వర్ల రామయ్య తెలిపారు. ఇక అంతేకాదు జగతి పబ్లికేషన్స్లో రూ.834 కోట్లు నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టుబడులు పెట్టారని ఆరోపణలు గుప్పించారు వర్ల రామయ్య.
నిమ్మగడ్డ ప్రసాద్ పై ఆసక్తికర వ్యాఖ్యలు
పత్రికారంగం లాభసాటి వ్యాపారం కాదు కదా? అలాంటప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్ ఎందుకు పెట్టుబడులు పెట్టారు? అయినా పత్రికా రంగంతో సంబంధం లేని వ్యక్తి పెట్టుబడులు పెట్టడం ప్రపంచంలో ఎక్కడా లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మొత్తానికి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకోవడం సీఎం హోదాలో ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి చేయాల్సిన పని కాదు అని వర్ల రామయ్య హితవు పలికారు.