"పవన్ కల్యాణ్ దుకాణం మూసేస్తాడు, జగన్ డ్రామా వెల్లడి"
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కేంద్రంపై అవిశ్వాసం పెట్టి ప్రధాని కార్యాలయం (పిఎంవో) చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ విశ్వాసం ప్రకటిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య వ్యాఖ్యానించారు.
Recommended Video
వైఎస్ జగన్ను అడ్డం పెట్టుకుని డ్రామాలు ఆడాలని బిజెపి చూస్తోందని ఆయన ఆదివారం మీడియా సమావేశంలో ఆరోపించారు. ప్రజల ఆగ్రహానికి వైసిపి గంగలో కలిసి పోతుందని ఆయన ఆదివారం మీడియా సమావేశంలో అన్నారు.
పవన్ కల్యాణ్ రాజకీయ అవగాహన లేని వ్యక్తి
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ అవగాహన లేని వ్యక్తి అని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. ఆ పార్టీ అధికార ప్రతినిధుల్లో ఇద్ర్దరు బిజెపి నాయకులున్నారని ఆయన విమర్శించారు. వాళ్లు బిజెపి మాటలు వింటారు తప్ప పవన్ మాట వినరని ఆయన అన్నారు.
చిరంజీవి కనీసం కొన్ని సీట్లైనా..
చిరంజీవి కనీసం కొన్ని సీట్లు గెలిచారు గానీ పవన్ కల్యాణ్ మాత్రం ముందే దుకాణం సర్దేస్తాడని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. మోడీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసిందనీ తాము కేంద్ర ప్రభుత్వంపైనా ప్రధాని మోడీపైనా అవిశ్వాస తీర్మానం పెడుతామని వైసిపి ఆర్భాటంగా ప్రకటించిందని, పార్లమెంటులో మాత్రం తూతూ మంత్రంగా నోటీసు ఇచ్చిందని ఆయన తప్పు పట్టారు.
విజయసాయి రెడ్డి ఇలా చెబుతున్నారు..
ఆంధ్రప్రదేశ్లో అవిశ్వాసాన్ని, ఢిల్లీలో మోడీ పట్ల విశ్వాసాన్ని అడుగడుగునా వైసిపి ప్రకటిస్తూ వస్తోందని అన్నారు. కేంద్రంపై అవిశ్వాసం పెడుతున్నామని చెబుతుూ ఢిల్లీలో పార్లమెంటు సాక్షిగా వైసిపి రాజ్యసభ సభ్యుడు, కేసుల్లో రెండో ముద్దాయి విజయసాయి రెడ్డి ప్రధాని మోడీపై సంపూర్ణమైన విశ్వాసం ఉందని ప్రకటిస్తున్నారని, ఇది వైసిపి ద్వంద్వ నీతికి నిదర్శనమని అన్నారు.
జగన్ ప్రకటనతో ఇలా..
రాజ్యసభలో తమ పార్టీ మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తుందని వైఎస్ జగన్ మీడియా ద్వారా ప్రకటించడంతోనే వైసిపి డ్రామా బయటపడిందని వర్ల రామయ్య అన్నారు. రాష్ట్ర ప్రజలను జగన్ బాహాటంగా మోసం చేస్తున్నారనేది తెలిసిపోయిందని అన్నారు. జగన్ ద్వంద్వ నీతి ప్రజలు గమనించాలని అన్నారు.
చంద్రబాబు పలుమార్లు కలిసినా..
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని చంద్రబాబు పలు మార్లు కలిసి ప్రదానిని కోరారని, అయితే దానికి 14వ ఆర్థిక సంఘం అంగీకరించలేదని చంద్రబాబును నమ్మించి దానికి సమానమైన ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పిన విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసునని వర్ల రామయ్య అన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులకు యూసీలు ఇవ్వలేదని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా చంద్రబాబుకు లేఖ రాయడం చంద్రబాబునే కాదు, రాష్ట్ర ప్రజలను అవమానించడమేనని అన్నారు.