నోరు అదుపులో పెట్టుకోండి: జగన్, పవన్లకు వర్ల వార్నింగ్
విజయవాడ: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని పవన్, జగన్లను వర్ల హెచ్చరించారు.
ఏపీ మంత్రి లోకేష్పై చేసిన అవినీతి ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు. పవన్కు నాలుగేళ్లుగా కనిపించని అవినీతి ఇప్పుడు కనిపించిందా? అని ప్రశ్నించారు. పవన్, జగన్కు సీఎం పదవిపై ధ్యాస తప్ప వేరే ఏమీ లేదని వర్ల దుయ్యబట్టారు.
ఇది ఇలా ఉండగా, టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. మోడీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి.. 20 లక్షల మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేకపోయారని డొక్కా విమర్శించారు.
త్వరలోనే ఏపీలో 20 వేల ప్రభుత్వ ఉద్యోగులకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామని చెప్పారు. ఈ నాలుగేళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో దాదాపు 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారన్నారు. త్వరలో 10 లక్షల మందికి నిరుద్యోగ భృతి కూడా ఇవ్వబోతున్నామని చెప్పారు.