ఆంధ్రా శశికళ జగన్.. ఇవాళో రేపో జైలుకే, వణుకు మొదలైంది..: వర్ల రామయ్య
జగన్ ఆంధ్రా శశికళ అంటూ అభివర్ణించిన ఆయన ఇవాళో రేపో జగన్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు.
చెన్నై: అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శి శశికళకు సుప్రీం కోర్టు జైలు శిక్ష విధించిన నాటి నుంచి.. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ వైసీపీ నేత జగన్పై టీడీపీ నేతలు విమర్శలు సంధిస్తున్నారు.
తాజాగా ఏపీ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్, టీడీపీ నేత వర్ల రామయ్య జగన్పై పలు విమర్శలు గుప్పించారు. జగన్ ఆంధ్రా శశికళ అంటూ అభివర్ణించిన ఆయన ఇవాళో రేపో జగన్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. శశికళ అక్రమాస్తుల కేసులో సుప్రీం తీర్పు వెలువరించిన నాటి నుంచి జగన్ లో వణుకు మొదలైందని ఆయన విమర్శించారు.
రూ.66 కోట్ల అవినీతి కేసులో శశికళకు నాలుగేళ్ల శిక్ష పడిందని గుర్తుచేస్తూ.. వేల కోట్ల రూపాయల అవినీతి కేసుల్లో జగన్ కు ఇంకెన్నేళ్లు శిక్ష పడాలి? అని ప్రశ్నించారు. జగన్ యువభేరీ సభలను సైతం ఆయన ఎద్దేవా చేశారు. యువభేరీ సభల ద్వారా తనను ఆదర్శంగా తీసుకోవాలని జగన్ కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు. శశికళ లాంటి వ్యక్తులకు జైలు శిక్ష పడటం రాజకీయ నాయకులకు చెంపపెట్టు లాంటిదని వర్ల రామయ్య అన్నారు.