చరిత్ర సృష్టించాలన్నా! తిరగరాయలన్నా.: బాలయ్యపై వర్ల, ‘నయనతార లాంటి భార్యే కావాలని..’
అమరావతి: ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశంసల వర్షం కురిపించారు. 'జై సింహా' ఆడియో వేడుకలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ అరాచకశక్తులకు 'రౌడీ ఇన్ స్పెక్టర్' బాలకృష్ణ అని అన్నారు.
ఫ్యాక్షనిజాన్ని ఇనుప పాదాలతో తొక్కే సమరసింహారెడ్డి బాలకృష్ణ అంటూ.. బాలయ్య నటించిన చిత్రాల పేర్లను ప్రస్తావిస్తూ వర్ల రామయ్య ప్రశంసలు కురిపించారు. 'చరిత్ర సృష్టించాలన్నా, తిరగరాయాలన్నా మీరే' అంటూ బాలయ్య వైపు చూస్తూ వర్ల రామయ్య అనడంతో నవ్వులు విరిశాయి.
బాలయ్య-నయనతార కాంబినేషన్ అద్భుతం
'బాలకృష్ణ-నయనతార కాంబినేషన్ అద్భుతం. తెరవెనుక కాంబినేషన్ గురించి నేను మాట్లాడటం లేదని, తెర ముందు మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే.. ప్రతి యువకుడు కూడా నా భార్య ఇలా ఉంటే, నా సంసారం కూడా ఇలా ఉంటే బాగుంటుందని.. కొత్తగా పెళ్లి అయిన వాళ్లు కూడా అనుకుంటున్నారు' అని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు.
ముద్దుల మామయ్య అంటూ..
కాగా, ఈ ఆడియో వేడుకలు మంత్రి లోకేష్, పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు. లోకేష్ కూడా ఈ కార్యక్రమంలో బాలయ్యను ముద్దుల మామయ్య అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. మీసం తిప్పాలన్న, తొడ గొట్టాలన్న బాలయ్యకే సాధ్యమని అన్నారు. చరిత్ర సృష్టించడం, తిరిగి రాయడం బాలయ్యకే సాధ్యమన్నారు.
బాలయ్య మాట్లాడుతూ..
తన చిత్రాల్లో వినోదంతోపాటు సందేశం కూడా ఉంటుందని చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలించే ప్రయత్నం జరగాలని అన్నారు. సినీ స్టూడియోలు ఇక్కడ నిర్మించాలని అన్నారు.
డైలాగులతో హోరెత్తించిన బాలయ్య
ఈ సందర్భంగా జై సింహా సినిమాలోని కొన్ని డైలాగ్స్ బాలయ్య చెప్పడంతో అభిమానులు కేకలు, అరుపులతో హోరెత్తించారు. కాగా, ఈ ఆడియో వేడుకలో జై సింహా చిత్ర దర్శక, నిర్మాతలు, హీరోయిన్లు, చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు. భారీగా బాలయ్య అభిమానులు పాల్గొని సందడి చేశారు.
తన సౌండ్ చూపిస్తానంటూ వర్ల రామయ్య
వర్ల రామయ్య ప్రసంగం మొత్తం అక్కడున్న అభిమానులను ఆకట్టుకుంది. ఆయన మాట్లాడుతున్నంతా సేపు వారంతా కేకలు, అరుపులతో హొరెత్తించారు. ఝాన్సీ.. వర్ల రామయ్య మాట్లాడతారని చెప్పగానే.. మైకు అందుకున్న ఆయన ఝాన్సీకి ఇచ్చినంత మైక్ సౌండ్ ఇవ్వాలన్నారు. అయితే, సౌండ్ మైకులో లేదని, తన గొంతులో ఉందని ఝాన్సీ సమాధానమిచ్చారు. దీంతో తన సౌండ్ చూపిస్తానని ప్రసంగం మొదలుపెట్టారు.
బాలయ్య-నయనతార తెరపైన బంధమే.. అసలైన కృష్ణుడు అంబికానే
బాలయ్యపై ప్రశంసలు కురిపిస్తూ.. ఆయన పాదం పెడితే అది శ్రీరామరాజ్యం అని వర్ల రామయ్య అన్నారు. టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత జై సింహా ఎంత పెద్ద హిట్ అవుతుంతో అర్థమైందని అన్నారు. ఫ్యాక్షనిజాన్ని ఇనుప పాదంతో తొక్కిన సమరసింహారెడ్డి, చెన్నవకేశరెడ్డి, నర్సింహనాయుడు బాలయ్య అని, గౌతమీపుత్ర శాతకర్ణితో తెలుగు కీర్తిని దశదిశలా చాటారని అన్నారు. జైసింహా సినిమాలో రెండు రాష్ట్రాలకు తానంటే ప్రాణమని బాలయ్య మరోసారి ఒక్కమాటతో కుమ్మేశారని అన్నారు. నయనతారకు, బాలయ్యకు ఎక్కడో అనుబంధం ఉందన్న ఆయన.. తాను చెబుతున్నది తెరపైనే కానీ, తెర వెనుకది కాదని వ్యాఖ్యానించారు. తెరపై బాలయ్య-నయనతార బాగుందని చెప్పారు. అనకూడదు గానీ, కొత్తగా పెళ్లైన వారు, చేసుకోబోతున్న వారు తమ భార్య నయనతారలా ఉండాలని కోరుకుంటున్నారని చెప్పారు. అందాల తారల చుట్టూ తిరిగే అసలు కృష్ణుడు బాలయ్య కాదని, ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ అంబికా కృష్ణ అని వర్ల రామయ్య సరదాగా వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, టీడీపీ తరపున క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వర్ల రామయ్య తన ప్రసంగాన్ని ముగించారు.