ఎన్టీఆర్ బయోపిక్ ఇప్పుడే ఎందుకు: విలన్ చంద్రబాబా, లక్ష్మీపార్వతా?
ఎన్టీఆర్ జీవితచరిత్రను తెరకెక్కిస్తానని వర్మ ప్రకటించిన వెంటనే పలు ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి.సినిమాలో వివాదాస్పద సంఘటనలుంటాయని ఆయన వ్రకటనను బట్టి అర్థమవుతోంది.
విజయవాడ: ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరకు ఎక్కిస్తానని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించడంతోనే రాజకీయవర్గాల్లో చర్చ ప్రారంభమైంది. ఆ సినిమా ఎలా ఉండబోతుందనే ఆసక్తి కూడా చోటు చేసుకుంది. అసలు ఈ సమయంలో ఆయన ఎన్టీఆర్ చిత్రాన్ని నిర్మించాలనే నిర్ణయానికి రావడంలోని ఆంతర్యం గురించి ఆసక్తి నెలకొంది.
ఎన్టీఆర్గా ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ నటించబోతున్నట్లు కూడా అధికారిక ప్రకటన వెలువడింది. ఎన్టీఆర్ తొలినాళ్ల జీవితం కడు పేదరికంలో గడిచింది. పాలు విక్రయిస్తూ ఆయన జీవనం సాగించేవారు. తన చిన్ననాటి పరిస్థితుల గురించి ఎన్టీఆర్ స్వయంగా అప్పట్లో ఓ మీడియా సమావేశంలో సుదీర్ఘంగా వివరించారు.
ఆయన సినీ జీవితం అద్బుతమైంది. కొన్ని వైఫల్యాలు ఎదురైనప్పటికీ సినీ రంగంపై ఆయన తిరుగులేని ఆధిపత్యం వహించారు. ఆయన రాజకీయ జీవితంలో ప్రధానంగా రెండు వివాదాలున్నాయి. ఒక్కటి - నాదెండ్ల భాస్కర రావు ఆయన ప్రభుత్వాన్ని కూల్చడం, రెండోది - ఆయన చేతి నుంచి అధికారం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి చేతుల్లోకి మారడం. వర్మ చేసిన ప్రకటన ప్రకారం వివాదాస్పద సంఘటనలు కూడా సినిమాలో ఉంటాయని అర్థమవుతోంది.
వర్మ ఏమన్నారంటే..
అత్యంత నిజమైన ఆ మహామనిషి ఎన్టీఆర్ బయోపిక్లో ఆయన శత్రువులెవరు? నమ్మకద్రోహులెవరు? ఎవరికీ తెలియని కాంట్రవర్సీల వెనుకాల అసలు కాంట్రవర్సీలు ఏమిటో అవన్నీ అశేష తెలుగు ప్రజానీకానికి అతి త్వరలో నా ‘ఎన్టీఆర్' చిత్రంలో చూపిస్తాను అని రామ్ గోపాల్ వర్మ అన్నారు. దీన్ని బట్టి ఆయన వివాదాలకు తనదైన పరిశోధనాత్మక కథనాన్ని జోడిస్తారని అర్థమవుతోంది.
నాదెండ్ల వివాదంతో పేచీ లేదు....
ఎన్టీఆర్ చేతుల్లోంచి అధికారాన్ని నాదెండ్ల భాస్కర రావు చేతుల్లోకి తీసుకోవడం, ఆ తర్వాత జరిగిన ఆందోళనలు, హై డ్రామాల విషయంలో విషయంలో ఎవరికీ పెద్దగా పేచీ లేదు. నాదెండ్ల భాస్కర రావు ఎంతగా చెప్పినప్పటికీ అది ఎన్టీఆర్కు అనుకూలంగానే వాదం బలపడింది.
అసలు విషయం ఇక్కడే....
ఎన్టీఆర్ని పదవీచ్యుతుడిని చేసి ప్రభుత్వాన్నీ పార్టీనీ చంద్రబాబు సొంతం చేసుకున్నారు. ఈ వివాదంపై ఇప్పటికీ సద్దుమణగలేదు. లక్ష్మీపార్వతిని విలన్గా చూపిస్తూ చంద్రబాబు అధికారాన్ని తన సొంతం చేసుకున్నారు. లక్ష్మీపార్వతిని చూపించే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర రావు, నందమూరి హరికృష్ణ తదితరులు చంద్రబాబుకు మద్దతు పలికారు. ఈ సంఘటనలో వర్మ ఎవరిని విలన్గా చూపిస్తారనేది ఆసక్తికరమైన విషయమే.
బాలకృష్ణ హీరో కాబట్టి....
బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ పాత్రను పోషిస్తున్నట్లు వర్మ ప్రకటనను బట్టి తెలుస్తోంది. రాజకీయాల్లో బాలకృష్ణ ప్రస్తుతం పూర్తిగా చంద్రబాబుకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఆయన ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. అందువల్ల అధికార మార్పిడి ఘటనకు సంబంధించి చంద్రబాబును వర్మ విలన్గా చూపించే అవకాశాలు ఏ మాత్రం లేవని అంటున్నారు. అప్పుడు తప్పనిసరిగా లక్ష్మీ పార్వతి విలన్ అవుతారు.
దగ్గుబాటి, పురంధేశ్వరి ఏమంటారు....
అధికార మార్పిడి సమయంలో చంద్రబాబుకు అండగా నిలిచిన దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఇప్పుడు విరోధిగా మారారు. దానివల్ల ఆయన వాదన ఆ సంఘటనపై మరో విధంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. చంద్రబాబుకు దూరమైన దగ్గుబాటి వెంకటేశ్వర రావు, ప్రస్తుతం రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఆయన సతీమణి, ఎన్టీఆర్ కూతురు పురంధేశ్వరి చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్నారు. చంద్రబాబుకు సినిమాలో క్లీన్చిట్ ఇస్తే వారి రియాక్షన్ ఎలా ఉంటుందనేది కూడా ఆసక్తికరమైన విషయమే.
ఇప్పుడే ఎందుకు....
ఎన్టీఆర్ జీవిత చరిత్రను ఇప్పుడే తెరకు ఎక్కించడానికి రాజకీయపరమైన కారణమేదైనా ఉందా అనే చర్చ నడుస్తోంది. ఎన్నికలకు దాదాపు 20 నెలల కాలం ఉంది. దాదాపుగా ఎన్నికలు సమీపించినట్లే. ఈ స్థితిలో మరోసారి తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని తెరమీదికి తెచ్చి, ఎన్టీఆర్ ఇమేజ్ను ఎన్నికల్లో వాడుకునే వ్యూహంలో భాగంగానే చంద్రబాబు పనుపు మీద వర్మ రంగంలోకి దిగి ఉండవచ్చునని కూడా అంటున్నారు. తండ్రి పాత్రలో తనయుడు బాలకృష్ణ నటించడం కూడా సినిమాకు ఓ క్రేజ్ను తెచ్చి పెడుతుందని చెప్పడంలో సందేహం లేదు.
ఎపిలో రాజకీయాలు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు సంక్లిష్టంగా మారాయి. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో గెలుస్తుందని కచ్చితంగా చెప్పే పరిస్థితి లేదు. వైయస్ జగన్మోహన్ రెడ్డి దూకుడు ప్రదర్శిస్తుండగానే, పవన్ కల్యాణ్ జనసేన రంగం మీదికి వస్తోంది. బిజెపి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి నడుస్తుందా లేదా అనేది కూడా అనుమానమే. పవన్ కల్యాణ్ పూర్తిస్థాయిలో ఎన్నికల్లోకి దిగినా జగన్ బలాన్ని తీసిపారేయడానికి లేదు. ఎపిలో అధికారాన్ని నిర్ణయించేవి కోస్తా ఫలితాలే. పవన్ కల్యాణ్ పోటీ వల్ల అక్కడి ఓట్లు మూడు ప్రధాన పార్టీల మధ్య ఆ ప్రాంతంలో చీలిపోతే టిడిపికి పెద్ద నష్టమే జరగవచ్చు. అందువల్ల ఎన్టీఆర్ ఇమేజ్ను రంగం మీదికి తెస్తే కోస్తాలో ఆయనకున్న ఆదరణనను ఓట్ల రూపంలోకి మార్చుకోవచ్చుననేది చంద్రబాబు వ్యూహం కావచ్చునని అంటున్నారు.
జూనియర్ ఎన్టీఆర్కు దెబ్బే....
బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ జీవిత చరిత్ర తెర మీదికి ఎక్కితే జూనియర్ ఎన్టీఆర్ లక్ష్యాలకు విఘాతం కలగవచ్చునని అంటున్నారు. తాత వారసత్వాన్ని పూర్తి స్థాయిలో తన సొంతం చేసుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ లక్ష్యమని అంటారు. రాజకీయంగా కూడా ఆయన వారసత్వాన్ని స్వీకరించాలని ఆయన భావిస్తున్నట్లు చెబుతారు. ఆయన బయటకు చెప్పపోయినా ఆ లక్ష్యం మాత్రం ఉందని ప్రచారం సాగుతూనే ఉంది. 2024 ఎన్నికల నాటికి రాజకీయాల్లో అడుగు పెట్టాలని జూనియర్ ఎన్టీఆర్ భావిస్తున్నట్లు చెబుతారు.