ఏపీ అసెంబ్లీపై వర్మ షాకింగ్ ట్వీట్.. స్పీకర్ హెడ్ మాస్టర్ , ఎమ్మెల్యేలు స్కూల్ పిల్లల్లట
వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ ఏపీ ఎన్నికల ముందే కాదు, ఏపీ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. నిత్యం వివాదాలతో కాలం గడిపే రాంగోపాల్ వర్మకు ఎప్పటికీ ఏదో ఒక ఇష్యూ కావాలి . ఇక ఇప్పుడు వర్మ దృష్టి ఏపీ అసెంబ్లీ పై పడింది. ఏపీ అసెంబ్లీ గురించి వర్మ పెట్టిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో చర్చనీయాంశం అవుతుంది.
యనమల వర్సెస్ జేసీ దివాకర్ రెడ్డి ..టీడీపీ ఓటమిపై పరస్పర ఆరోపణలు
ఏపీ అసెంబ్లీ తీరుపై సెటైర్లు వేసిన రాం గోపాల్ వర్మ
మొన్నటి వరకు లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీని పట్టుకొని చంద్రబాబు టీడీపీ ప్రభుత్వాన్ని తన ట్వీట్ లతో, తన వ్యాఖ్యలతో ఇబ్బందికి గురి చేసిన రాం గోపాల్ వర్మ వైసీపీ ప్రభుత్వం వచ్చాక కాస్త సైలెంట్ అయ్యారు . తన లక్ష్మీస్ ఎన్టీఆర్ ను విడుదల చేయించి చంద్రబాబుపై ప్రతీకారం తీర్చుకున్న వర్మ తాజాగా చంద్రబాబు మీద సంచలన వ్యాఖ్య చేశారు. టీడీపీని కాపాడాలంటే జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగాలని వర్మ ట్వీట్ చేశారు. అయితే ఇప్పుడు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రతీ చానెల్ లో లైవ్ వస్తున్న ఏపీ శాసనసభా సమావేశాలను వివాదాస్పద వర్మ కూడా చూశారు ..ఇంకేం ఏపీ అసెంబ్లీ తీరుపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు వర్మ . తాజాగా వర్మ ఏపీ స్పీకర్, ఎమ్మెల్యేల తీరుపై సంధించిన ట్వీట్ చూస్తే ఏపీ అసెంబ్లీ వర్మకు ఎలా కనిపించిందో అర్ధం అవుతుంది.
స్పీకర్ హెడ్ మాస్టర్ లా, ఎమ్మెల్యేలు స్కూలు పిల్లల్లా కనిపిస్తున్నారన్న వర్మ
తనకు ఏపీ అసెంబ్లీ లైవ్ చూసినప్పుడు స్పీకర్ ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయడానికి, వారి దూకుడును తగ్గించడానికి పదే పదే బెల్ కొడుతున్నాడని అనిపించిందని పేర్కొన్నారు వర్మ. ఇక అసెంబ్లీలోఆ బెల్ సౌండే ఎక్కువగా వినపడుతోందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు మరీ స్కూలు పిల్లల్లా కొట్లాడుకుంటుంటే స్పీకర్ ఆ బెల్ మోత మోగిస్తున్నాడని వర్మ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ అసెంబ్లీ చూస్తుంటే తనకు ఎమ్మెల్యేలను స్కూలు పిల్లల్లా, స్పీకర్ హెడ్ మాస్టర్ లా కనిపిస్తున్నాడని వర్మ ఎద్దేవా చేశారు.
అసెంబ్లీలో చంద్రబాబు తప్పులు తప్ప వేరే చర్చ లేదా అన్న వర్మ
ఇక ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోస్తూ టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను , చంద్రబాబు చేసిన మిస్టేక్స్ ను ఎత్తిచూపడం తప్పితే తనకు ప్రస్తుత సమస్యలు కానీ, ఏపీ భవిష్యత్ పై చర్చ కానీ కనిపించడం లేదని వర్మ ప్రస్తుతం అసెంబ్లీ నడుస్తున్న తీరుపై ఉన్నది ఉన్నట్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక వర్మ చేసిన ట్వీట్ కు నెటిజన్లు కూడా బాగానే స్పందిస్తున్నారు. కొందరు వర్మను సమర్ధిస్తూ కామెంట్ పెడుతున్నారు. ఏపీ అసెంబ్లీ చూస్తే మాకు చిరాగ్గానే ఉందని కొందరు అంటున్నారు. అసెంబ్లీ మీటింగ్ లు ఇలానే ఉంటాయి వర్మ గారు కొందరు అని వ్యాఖ్యానిస్తున్నారు.