వంగవీటి రంగా హత్యలో మాస్టర్ప్లాన్ దేవినేని ఉమాదే:మాజీమంత్రి వసంత నాగేశ్వరరావు సంచలనం
విజయవాడ:మంత్రి దేవినేని ఉమ తనపై , తన కుమారుడిపై పరోక్షంగా చేసిన విమర్శలపై మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు ఘాటుగా ప్రతిస్పందించారు. కంచికచర్లలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంత్రి దేవినేని ఉమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
రోజుకొక పార్టీ మారుతూ, ఆస్తుల కోసం హత్యలు చేసే హంతకులు డబ్బు సంచులతో వస్తున్నారంటూ తనపై, తన కుమారుడు వసంత కృష్ణప్రసాద్పై మంత్రి ఉమా కొద్దిరోజులుగా చేస్తున్న ఆరోపణలపై వసంత నాగేశ్వరరావు మండిపడ్డారు. అసలు కృష్ణా జిల్లాలో హత్యలు చేయించేది, వాటిని ప్రోత్సహించేది ఎవరన్నది ప్రజలందరికీ తెలుసన్నారు. వంగవీటి రంగా హత్యలో మాస్టర్ప్లాన్ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుదేనని వసంత నాగేశ్వరరావు ఆరోపించారు.
హత్యలు చేసి జైళ్లకు వెళ్లింది ఉమా కుటుంబీకులేనన్నారు. దేవినేని ఉమా వదిన ఎలా చనిపోయిందో, అందులో ఎవరి హస్తముందో అందరికీ తెలుసన్నారు. దేవినేని ఉమా నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండు...హత్యా రాజకీయాలు , ఆర్థిక నేరాల చేసింది మీరు...సమయం వచ్చినప్పుడు మీరు చేసిన అకృత్యాలన్నీ బైటపెడతానన్నారు. ఇది అంతం కాదు ఆరంభమేనన్నారు. ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ వారే తనకు మంత్రి అక్రమాల గురించి చిట్టా తెచ్చి ఇస్తున్నారన్నారు. నువ్వుచేసిన తప్పులు చాలా ఉన్నాయని, అవన్నీ వరుసగా బైటకు వస్తాయన్నారు.
దేవినేని ఉమా ఎంతటి అసమర్థుడో తాను విడమరిచి చెప్పనక్కరలేదని ఎద్దేవా చేసిన వసంత నాగేశ్వరరావు...ఉమా కనీసం తనకు రాజకీయంగా జన్మ ఇచ్చిన కంచికచర్ల...వీరులపాడు మండలాలకు సైతం నీరు ఇవ్వలేకపోయారన్నారు. జలవనరుల శాఖా మంత్రిగా వ్యవహరిస్తున్నదేవినేని ఉమా కనీసం తన ప్రాంత ప్రజలకు సాగునీటిని కూడా అందించలేకపోవటంపై ధ్వజమెత్తారు.