ఏపీకి ప్రత్యేక హోదా: 'శివాజీ దీక్ష విరమించాలి'
గుంటూరు: సినీ నటుడు శివాజీ ఆమరణ నిరాహార దీక్ష విరమించాలని మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు కోరారు. సోమవారం గుంటూరులో ఆయన మాట్లాడుతూ 'ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు' అని అన్నారు. ప్రత్యేక హోదా కోసం రాజకీయ పార్టీలన్నీ కలిసి పోరాటం చేయాలని సూచించారు. ఆరోగ్య పరిస్ధితిని దృష్టిలో ఉంచుకుని శివాజీ చేస్తోన్న దీక్షను విరమించాలని ఆయన కోరారు. కాగా, శివాజీకి సోమవారం వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.
బీపీ, షుగర లెవెల్స్ సాధారణంగానే ఉన్నాయని వారు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ శివాజీ ఆదివారం గుంటూరు కలెక్టరేట్ వద్ద ఆమరణ నిరాహర దీక్షను చేపట్టిన సంగతి తెలిసిందే. సోమవారానికి ఆయన చేపట్టిన దీక్ష రెండో రోజుకి చేరుకుంది.
ప్రత్యేక హోదా వచ్చే వరకు దీక్ష విరమించేది లేదని శివాజీ సోమవారం ఉదయం చెప్పారు. శివాజీ దీక్షకు పలువురు మద్దతు తెలిపారు. శివాజీకీ జనసేన పార్టీకి చెందిన విజయవాడ నాయకులు కూడా మద్దతు ప్రకటించారు. ఏపీని రాజధాని లేకుండా తలలేని మొండెంలా చేశారని శివాజీ మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే ఇతర రాష్ట్రాల నుండి ఒత్తిడి వస్తుందంటూ తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
ఏపీకి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆనాడు మాట్లాడిన నేతలే ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలని సూచించారు. ఆయన పోరాడితే కేంద్రం తప్పకుండా దిగొస్తుందన్నారు.
కాగా, పోలీసులు శివాజీ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉండగా, శివాజీ పైన కామినేని శ్రీనివాస్ రావు ధ్వజమెత్తారు. శివాజీ ఏ పార్టీలో ఉన్నారో తల్చుకోవాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా అంశంపై బీజేపీకి స్పష్టమైన వైఖరి ఉందన్నారు. ఆయన విశాఖలో మాట్లాడారు. శివాజీ పాపులారిటీ కోసమే దీక్ష చేస్తున్నారని ఆరోపించారు.